భూపాలపల్లి, మే 16 : సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకుందామని, ఇది అందరి బాధ్యత అని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావు పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 1వ గని వద్ద టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి ఆధ్వర్యంలో సోమవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి వెంకట్రావు ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. దురదృష్టవశాత్తు సింగరేణిని ప్రవేటీకరిస్తే తండ్రీకొడుకుల ఉద్యోగాల వంటి చాలా హక్కులు పోతాయని తెలిపారు. రోజుకు 12 గంటల పని ఉంటుందన్నారు. అందరం ఏకతాటిపైకి వచ్చి, సమ్మె చేయడం వల్లే సింగరేణి బ్లాకుల వేలం తాత్కాలికంగా నిలిచిపోయిందని తెలిపారు.
ఇదే స్ఫూర్తితో భవిష్యత్లో పోరాటానికి సిద్ధంగా ఉండాలని కార్మికులకు పిలుపునిచ్చారు. జాతీయ సంఘాలు రెండేండ్లలో ఎన్నికలు వస్తాయని అనేక సమావేశాలు పెట్టి ఓట్లు అడిగారని, ఎన్నికలు వచ్చాయా అని వారిని ప్రశ్నించారు. ఈ నెల చివరి నాటికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి, జూన్ లేదా జూలైలో ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. కారుణ్య నియామకాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఒకటి అరా పరిష్కారమయ్యేలా చూస్తామని తెలిపారు. అలాగే 40 ఏండ్ల వయస్సు పెంపు సర్క్యూలర్ తెస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. సింగరేణిలో మూడుసార్లు గుర్తింపు సంఘంగా గెలిచిన ఏఐటీయూసీ ఏ హక్కులనూ సాధించకపోగా, ఉన్న వాటిని పోగొట్టిందని దుయ్యబట్టారు.
అదే సింగరేణిలో టీబీజీకేఎస్ గెలుపొందిన తర్వాత గడిచిన పదేండ్లలో నాటి తెలంగాణ ఉద్యమ రథసారథి, నేటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహకారంతో అనేక హక్కులు సాధించినట్లు గుర్తుచేశారు. తండ్రీకొడుకుల ఉద్యోగాలు, సింగరేణి కార్మికుల తల్లిదండ్రులకు ఉచిత కార్పొరేట్ వైద్యం, సింగరేణి క్వార్టర్లలో ఏసీ పెట్టుకున్న వారికి ఉచిత కరంట్ తదితర అనేక కార్యక్రమాలు అమలు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీబీజీకేఎస్ యూనియన్కే దక్కుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు చల్లా జక్కిరెడ్డి, రత్నం సమ్మిరెడ్డి, కొలిపాక నర్సింగారావు, చక్రపాణి, కొచ్చర్ల రవికుమార్, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.