ఎదులాపురం, మే 21 ః జాతీయ జనాభా గణన (సెన్సెస్) సర్వేలో భాగంగా ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా గురువారం తన ఛాంబర్లో ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ (డిజిటల్ పద్ధతిలో స్వయం నమోదు) ప్రక్రియను పూర్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పాల్గొని మొబైల్, ఆన్లైన్ పోర్టల్ ద్వారా తన కుటుంబానికి సంబంధించిన వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సాంకేతికతను వినియోగిస్తూ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ విధానం ప్రజలకు సులభతరంగా ఉండడంతోపాటు సమయాన్ని ఆదా చేస్తున్నదని తెలిపారు. వంద శాతం జనాభా గణన పూర్తి చేయడమే లక్ష్యమని పేరొన్నారు.