ఎదులాపురం, ఆగస్టు 3 : పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కొలాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో గురువారం నిర్వహించిన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నులిపురుగుల వలన పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత, శారీరక, మానసిక సమస్యలు వస్తాయన్నారు. వాటిని అరికట్టేందుకు వైద్యసిబ్బంది ద్వారా ఈ మాత్రలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 1 నుంచి 19 ఏళ్లలోపు గల 1,92,725 మంది పిల్లలను గుర్తించామని వీరికి ప్రభుత్వ దవాఖానలు, అంగన్వాడీ కేంద్రాలు, వైద్యసిబ్బంది ద్వారా మాత్రలు అందిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ మాత్రలు వేయించాలన్నారు. అనంతరం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్, డీడబ్ల్యువో మిల్కా, డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, డీఎంవో మెట్పెల్లివార్ శ్రీధర్, ఏటీడీవో నిహారిక, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
రక్షణ సంబంధిత పరికరాలు పరిశీలన
ఎదులాపురం, ఆగస్టు 3 : భారీ వర్షాలు, వరదలు వంటి విపత్తులు సంభవించినప్పుడు ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు రక్షణ చర్యలు తీసుకుంటున్నదని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే అవసరమైన రక్షణ సంబంధిత పరికరాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జైనథ్, బేల, భీంపూర్, ఉట్నూర్, ఇచ్చోడ, బోథ్ మండలాలకు ఈ విపత్తు రక్షణ కిట్లను పంపిణీ చేసి అందుబాటులో ఉంచాలని సూచించారు. మావల అర్బన్పార్క్లో అటవీ, పోలీస్, అగ్నిమాపక ,ఇతర శాఖల అధికారులు, మత్స్యకారులకు, ఇతర సిబ్బందికి త్వరలో ఈ రక్షణ సంబంధిత కిట్ల వినియోగంపై శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇన్చార్జి డీపీఆర్వో ఈ విష్ణువర్ధన్, కలెక్టరేట్ పర్యవేక్షకురాలు స్వాతి పాల్గొన్నారు.