గర్భిణులు, బాలింతలు, కౌమార బాలికలు, చిన్నారుల ఆరోగ్యమే ధ్యేయం
ఒక్కో అంశంపై అవగాహన కల్పిస్తున్న మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు
మంచిర్యాల అర్బన్, మార్చి 26 : పోషణ్ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు గర్భిణులు, బాలింతలు, కౌమార బాలికలు, చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. మార్చి 16 నుంచి 31 వరకు పోషణ్ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా రక్తహీనతను రూపుమాపి ఆహారంతోపాటు డయేరియా, శుద్ధనీరు, పరిశుభ్రత, పారిశుధ్యంపై అవగాహన, మహిళలు, కౌమరదశలో ఉన్న బాలికలు, పిల్లల్లో రక్తహీనతకు గల కారణాలు, శిశు పోషణ కోసం ఇవ్వాల్సిన తల్లిపాలు, ఇతర అనుబంధ ఆహారంపై, విరె చనాలు కలిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఇంకా.. పెరటి తోటల పెంపకం, పంచాయతీ విషయాలపైన దృష్టి సారించి ప్రజలకు పోషణ అందించడం చేస్తున్నారు. పాఠశాల కమిటీలు, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, సర్పంచ్లు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూర్, లక్షెట్టిపేట, మంచిర్యాల ప్రాజెక్టుల పరిధిలో గల 969 అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
పక్షం రోజులు చేయాల్సిన పనులివే..
అంగన్వాడీ కేంద్రాల లోపల, వెలుపల పారిశుధ్యం, ప్రత్యేకించి పురుషులను పోషణపై చైతన్య పర్చడం(భర్తలు, ఐదేండ్ల లోపు పిల్లల తల్లిదండ్రులు, మామలు) చేశారు. అలాగే పిల్లల బరువు, ఎత్తు చూడడం, వంటల పోటీలు నిర్వహించడం, పోషకాహారంపై గ్రామస్తులకు అవగాహన కల్పించడం, పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, హ్యాండ్ వాష్పై అవగాహన కల్పించడం, యువజన, కిశోర బాలికలతో సమావేశాలు ఏర్పాటు చేయడం, యువతతో పోషణ్ ర్యాలీ, యోగా, చెట్ల పెంపకం, పెరటి తోటల పెంపకం, పంచాయతీలలో సమావేశాలు ఏర్పాటు చేయడం, స్వయం సహాయక సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం, ప్రతిజ్ఞ, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్ని శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి రౌవూఫ్ ఖాన్ తెలిపారు.