ఇంద్రవెల్లి, డిసెంబర్ 2: ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తప్పకుండా వేసుకోవాలని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్, డీపీవో శ్రీనివాస్ అన్నారు. ఇంద్రవెల్లి పంచాయతీ పరిధి మిలింద్నగర్లో వ్యాక్సినేషన్ను గురువారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వ్యాక్సిన్పై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించాలన్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే కొవిడ్ను నియంత్రించవచ్చన్నారు. ఇంటింటికీ వెళ్లి టీకాలు వేస్తున్నట్లు చెప్పారు.వ్యాక్సిన్పై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్, ఎంపీవో సంతోష్, సర్పంచ్ కోరెంగా గాంధారి, హెల్త్ సూపర్వైజర్ జాదవ్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కోరెంగా సుంకట్రావ్, పంచాయతీ సిబ్బంది శంకర్లాల, నారాయణ, ఈద్రిశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
అపోహలు వీడాలి
ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 2: టీకాపై అపోహలు వీడి, తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని ఖానాపూర్లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ సెంటర్ను మున్సిపల్ చైర్మన్తో పాటు అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం పరిశీలించారు. అనంతరం కాలనీలో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు టీకాపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ టీకా వేసుకునేలా వైద్య సిబ్బంది, మెప్మా సిబ్బంది చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి
ఇచ్చోడ, డిసెంబర్ 2 : కొవిడ్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని.. వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ను మరింత వేగవంతం చేయాలని ఆదిలాబాద్ జడ్పీ సీఈవో గణపతి అన్నారు. ఇచ్చోడలోని రంజాన్పుర, ఇస్లాంపుర కాలనీలతో పాటు మండలంలోని కేశవపట్నంలోని వ్యాక్సినేషన్ కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు. కొవిడ్ టీకాలు వేసుకోని వారి ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా కార్యదర్శులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎల్పీవో ధర్మారాణి, ఎంపీడీవో వామన భట్ల రాంప్రసాద్, ఎంపీవో రమేశ్, కార్యదర్శి సూర్య ప్రకాశ్, దత్తహరి, సిబ్బంది పాల్గొన్నారు.
వాక్సినేషన్ పరిశీలన
ఖానాపూర్రూరల్, డిసెంబర్ 2 : ఖానాపూర్లోని పలు వార్డులో నిర్వహించిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా వైద్యాధికారి ధన్రాజ్ పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ను పర్యవేక్షించామని తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒమిక్రాన్ వేరియంట్, కరోనా వైరస్ థర్డ్ వేవ్ వ్యాప్తి చెందకుండా వేగంగా వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేయాలని ఆదేశించారు. వైద్యులు శ్రీనివాస్, కిరణ్మయి పాల్గొన్నారు.
వేగవంతం చేయాలి
పెంబి, డిసెంబర్ 2 : గ్రామాల్లో వ్యాక్సినేషన్ను వేగవంతం చేసి 100 శాతం పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే అధికారులు, వైద్యులను ఆదేశించారు. నాగాపూర్లో వ్యాక్సినేషన్ను గురువారం పరిశీలించారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీకా వేసుకోవాలని సూచించారు. వంద శాతం పూర్తి చేసేందుకు అధికారులకు, వైద్యులకు సహకరించాలని కోరారు. తహసీల్దార్ రాజ్మోహన్ , ఎంపీవో రత్నాకర్ రావు, డాక్టర్ నాగారాజు, ఆర్ఐ, పంచాయతీ కార్యదర్శి, ఏఎన్ఎం, ఆశ కార్యకర్త, అంగన్వాడీ టీచర్ తదితరులున్నారు.
కడెం, డిసెంబర్ 2 : అన్ని గ్రామాల్లో వంద శాతం టీకాలను పూర్తి చేయాలని డీపీవో వెంకటేశ్వర రావు అధికారులు, వైద్య సిబ్బందికి సూచించారు.మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి, వ్యాక్సిన్ వేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. మొక్కలను సంరక్షించాలని, నర్సరీలను పనులను పూర్తి చేయాలన్నారు. ఎంపీవో వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.