సారంగాపూర్/ఇచ్చోడ, నవంబర్ 27 : విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచడానికి విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసింది. కరోనా కాలంలో ఆన్లైన్ పాఠ్యాంశాలు బోధించడంతోపాటు ఇంటి వద్దే ఉండి సామర్థ్యాన్ని పరీక్షించడానికి విద్యాశాఖ వాట్సాప్ ఆధారిత ఇంటింటా చదువుల పంట కార్యక్రమాన్ని అమలు చేసింది. ఆయా తరగతుల విద్యార్థులను కార్యక్రమంలో భాగస్వాములను చేసింది. ప్రత్యక్ష తరగతులు అమలుకావడంతో ఆపేశారు.
మళ్లీ కార్యక్రమాన్ని అమలు చేయడానికి విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది. సాంకేతికను జోడించి రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 29వ తేదీ నుంచి ఆయా పాఠశాలల్లో అమలు చేస్తున్నది. ఎస్ఏ-1 పరీక్షలు ముగియడంతో ఇంటింటా చదువుల పంట కార్యక్రమంపై దృష్టిసారించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 202 బడులు ఉండగా.. 1,908 మంది విద్యార్థులు(మూడు నుంచి పదో తరగతి వరకు) వాట్సాప్లో ఫోన్ నంబర్స్ను రిజిస్ట్రేషన్ చేసుకొని అమలు చేస్తున్నారు. సోమవారం నుంచి వారం రోజులపాటు బోధించిన పాఠ్యాంశాలపై ప్రతి శనివారం విద్యార్థులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో నమోదు చేస్తారు. దీంతో విద్యార్థుల సామర్థ్యం పెరుగుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు.
విద్యాశాఖ చేపట్టిన వాట్సాప్ సందేహాల నివృత్తిని పక్కాగా అమలు చేసే చర్యలు చేపట్టాం. జిల్లాలోని ప్రధానోపాధ్యాయులకు ఉత్తర్వులు ఇచ్చాం. 3 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు ఇంటి వద్దే ఇంటింటా చదువుల పంట కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం ఉపయోగకరంగా ఉంటుంది. దీని వల్ల విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడుతాయి. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.
– రవీందర్రెడ్డి, జిల్లా విద్యాధికారి, నిర్మల్.