ఉట్నూర్ రూరల్, మే 10 : రాష్ట్రంలో అడవుల పెంపునకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా హరితహారం కార్యక్రమా న్ని ప్రారంభించింది. గడిచిన ఏడు విడుతల్లో కో ట్లాది మొక్కలు నాటింది. జాతీయ గ్రామీణ ఉపా ధి హామీ పథకం, అటవీ, పంచాయతీ రాజ్ శాఖ ల ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేసింది. అదే తరహాలో ఈ సంవత్సరం కూడా సర్సరీల్లో మొ క్కలను విరివిగా పెంచుతున్నారు. ఇందులో పూలు, పండ్లు తదితర మొక్కలు పెంచుతుండ గా.. భారీఎత్తున నాటేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం కాగానే మొక్కలు నాటేలా సిద్ధం చేస్తున్నారు.
నర్సరీల్లో ఎదుగుతున్న మొక్కలు
హరితహారంలో మొక్కలు నాటడానికి నర్సరీల్లో మొక్కలు ఏపుగా ఎదుగుతున్నాయి. అధికారులు మూడునెలల నుంచే నర్సరీలు ఏర్పాటు చేశారు .అందులో అన్ని రకాల మొక్కలు పెంచుతున్నారు. ఇందుకు అటవీశాఖ అధికారులు స్థానిక ఆర్డీవో కార్యాలయ ఆవరణలో కేటీఆర్ (కవ్వాల్ టైగర్ రిజర్వ్) ఆధ్వర్యంలో 2 లక్షల మొక్కలు మొక్కలు పెంచుతున్నారు. ఇందులో వేప, ఇర్కి, రావి, మర్రి, గుల్మోర్, జువ్వి, ఫిల్సాఫాం, కానుగ, బాంబుతో పాటు పండ్ల రకాలైన చైనా బాదం, అల్లనేరుడు, సీతాఫలం, ఉసిరి, జామ వంటి అడవి, పండ్ల మొక్కలకు ప్రాధాన్యమిచ్చారు. ప్రతి గ్రామపంచాయతీలో అవసరం మేరకు మొక్కలు పెంచుకునేందుకు నర్సరీలు ఏర్పాటు చేశారు. అందులో పండ్ల రకాలు సీతాఫలం, ఉసిరి, జామ, ద్రాక్ష, నిమ్మ, దానిమ్మ, బాదంతో పాటు ఇంటి ఆవరణలో నాటుకోవడానికి పూల మొక్కలు మల్లె, గులాబీ, మందార, గన్నేరు, ఇంటి అలంకరణకు సంబంధించినవి, కానుగ మొక్కలు పెంచుతున్నారు. 13 గ్రామ పంచాయతీలకు సంబంధించిన 3 లక్షల మొక్కలను సిద్ధం చేశారు. మిగతా 19 గ్రామాల్లో వారి గ్రామ పంచాయతీల్లో 10వేల చొప్పున పెంచుతున్నారు. నర్సరీల్లో ప్రతి విత్తనం మొలకెత్తేలా, మొక్కలన్నీ బతికేలా ప్రతిరోజూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
రెండు పూటలా నీరు పడుతున్నాం
ఎండలు మండిపోతున్నాయి. దీనికితోడు నర్సరీల్లో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో వాటికి నీరుపట్టడం ముఖ్యం. మొక్కలు ఎండిపోకుండా ప్రతిరోజూ రెండు పూటలా నీళ్లు పడుతున్నాం. నర్సరీలో ప్రతిరోజూ పది మంది కూలీలు పని చేస్తున్నాం. మాకు కూలి పని కూడా లభిస్తుంది.
– రాజన్న, కూలీ
అడవుల శాతం పెంచేందుకు చర్యలు
కవ్వాల్ టైగర్ జోన్ ప్రాంతంలో అడవుల శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నం. అందుకు అడవిలోని ఖాళీ స్థలాల్లో ఎదిగిన మొక్కలు నాటేందుకు అడవి, పండ్ల జాతి మొక్కలను సిద్ధం చేస్తున్నాం. ఈ ఏడాది నాటేందుకు లక్ష మొక్కలను పెంచుతున్నాం.
– గులాం మోయినొద్దీన్, ఎఫ్ఆర్వో