కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రజా పాలన కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గురువారం నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీల్లో అధికారులు గ్రామ సభలు నిర్వహించి అర్జీలను స్వీకరించనున్నారు.
ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని 1,18,460 కుటుంబాల నుంచి అర్జీలను స్వీకరించేందుకు 1,215 కౌంటర్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ అర్జీలను నేటి నుంచి స్వీకరించనున్నారు. గ్రామాల్లో కుటుంబాల సంఖ్యను బట్టి జనవరి 5వ తేదీ వరకు అర్జీలను స్వీకరిస్తారు. ఈ గ్రామ సభల్లో ప్రజలు నేరుగా దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు.