జైనథ్, మే 28 : రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి అక్రమాలను నిరోధించడానికి ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని భోరజ్ చెక్పోస్టు వద్ద ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. ఇందులో కరీంనగర్ ఏసీబీ ఇన్స్పెక్టర్ తిరుపతి భోరజ్ చెక్పోస్టును ఉదయం 11 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో విధులు నిర్వహిస్తున్న ఎంవీఐ యశ్వంత్ కుమార్, ఏఎంవీఐ అపర్ణ ఇద్దరు ఆర్టీవో అధికారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా భోరజ్ చెక్ పోస్టు రికార్డులను హాజరు పట్టిక, కంప్యూటర్లో పొందుపరుస్తున్న వాహనాల నిధులపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు భోరజ్ చెక్పోస్టు పరిసరాలు, ఇందులో ప్రైవేట్ ఉద్యోగులు ఎవరైన విధులు నిర్వహిస్తున్నారన్న అంశంపై ఆరా తీస్తున్నారు. ఇందులో వాహనాల ట్యాక్సుకు మించి ఉన్న రూ.11 వేలను స్వాధీనం చేసుకున్నారు.