మంచిర్యాల ఏసీసీ, జూన్ 13 : మంచిర్యాల జిల్లా వైద్యారోగ్యశాఖ సిబ్బంది లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. బెల్లంపల్లికి చెందిన డీ రామసాగర్ తన సోదరికి చెందిన ఎర్టీగా కారును మంచిర్యాల డిప్యూటీ డీఎంహెచ్వో కార్యాలయంలో ఏడాది పాటు అద్దె ప్రతిపాదికన నడిపిచేందుకు ఒప్పందం చేసుకున్నాడు. దీంతో ఆరు నెలల బిల్లు (రూ.1.96 వేలు) చెల్లించాలని అధికారులను కోరగా అధికారులు జాప్యం చేస్తూ వచ్చారు. రూ. 10 వేలు ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తామని చెప్పా రు. దీంతో రామసాగర్ ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పాడు. వారి సూచన మేరకు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారులు రామసాగర్ను డబ్బులతో కార్యాలయానికి పంపించారు. అనంతరం ఏసీబీ అధికారులు దాడి చేసి లంచం తీసుకుంటున్న ఔట్ సోర్సింగ్ సీనియర్ అకౌంటెంట్ సిరికొండ దీపిక, సహకరించిన మరో సీనియర్ అకౌంటెంట్ పులి రాజనర్సయ్యను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అనంతరం ఏసీబీ డీఎస్పీ భద్రయ్య మీడియాకు వివరాలు వెల్లడించారు. కారు యజమాని అద్దె బిల్లు చెల్లించాలని గతంలో ఇక్కడ పని చేసిన కార్యాలయ సీనియర్ అసిస్టెంట్, ప్రస్తుతం రామగుండం ప్రభుత్వ వైద్య కళాశాల సూపరింటెండెంట్ షఫీయుద్దీన్ను సంప్రదించింది. దీంతో అతను రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బదిలీపై వెళ్లిన తర్వాత బిల్లు క్లియర్ అయ్యింది. దీపిక మళ్లీ కారు యజమానికి ఫోన్ చేసి కార్యాలయానికి రావాలని సూచించింది. దీంతో ఆమె అక్కడికి వెళ్లగా షషీయుద్దీన్ సార్ డబ్బులు తనకు ఇవ్వమన్నాడని దీపిక చెప్పింది. దీపిక మరో పనిలో బిజీగా ఉండగా, అక్కడే విధులు నిర్వహిస్తున్న రాజనర్సయ్యను డబ్బు లు తీసుకోవాలని కోరారు. ఆ డబ్బులను తీసుకొని అక్కడే రోడ్డుపై ఉన్న షఫీయొద్దీన్కు తీసుకెళ్లి ఇచ్చాడు. తమ సిబ్బందితో కలిసి దాడి చేసి షఫీయుద్దీన్, అకౌంటెంట్ దీపిక, సహకరించిన రాజనర్సయ్యను పట్టుకున్నామని వివరించారు. వారిని ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు తెలిపారు.