మంచిర్యాల, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేసీఆర్ ఏం చెప్పినా.. ఏం చేసినా దాని వెనుక పకడ్బందీ వ్యూహం ఉంటది. ఆయన ఒట్టిగనే ఏం చేయరు. తెలంగాణ కోసం పోరాడినప్పుడు చాలా మంది ఆయనతో ఏం కాదు.. సాధించలేరు అన్నరు. కానీ.. కేసీఆర్ ‘నేను సచ్చుడో..తెలంగాణ వచ్చుడో’ అని పట్టుబట్టారు. ఎన్నో సవాళ్లకు ఎదురొడ్డారు. రాజకీయ మహామహులను ఢీ కొట్టారు. తెలంగాణ కోసం అందిరినీ మెప్పించి.. వొద్దు అన్నొళ్లను ఒప్పించి రా ష్ట్రం సాధించి చూపించుడు. ‘సమైఖ్య పాలనలో చిదిమిన తెలంగాణ కోసం ఎలాంటి ఉద్యమమైతే చేశారో.. ఒకప్పుడు కాంగ్రెస్, గిప్పుడు బీజేపీ పాలనలో కొట్టుమిట్టాడుతున్న భారతమాతకు విముక్తి కల్పించేందుకు మరో ఉద్యమాన్ని మొదలుపెడుతున్నడు’. ఓట్ల కోసం కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే చిల్లర రాజకీయ పార్టీలకు.. ప్రజ ల కోసం.. దేశం కోసం ఎంతకైనా తెగించే కేసీఆర్కు ఉన్న తేడా ఇదే. ఆయన లాంటి లీడరే దేశానికి కావాలి. దీని కోసమే ఇన్ని రోజులు పట్టుపట్టిండు.. దేశం మొత్తం తిరిగిండు. ఎందరినో కలుసుకున్నడు. గిప్పుడు పార్టీ పెడుతుండు. ఆయన ఒక్కసారి అనుకున్నడు అంటే అది కచ్చితంగా చేసి చూపిస్తడు. తెలంగాణను ఎట్లయితే అభివృద్ధి చేసిండో.. దేశాన్ని గట్లనే ప్రగతి పథంలో నడిపిస్తడు. భారతదేశాన్ని బాగు చేసి చూపిస్తడు. ఇలాంటి లీడరే దేశానికి కావాలి.
ఇతర రాష్ర్టాల్లోనూ కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నరు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల ప్రజలు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని బలంగా ఆకాంక్షిస్తున్నరు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, మిషన్ భగీరథ, షాదీ ముబారక్ వంటి పథకాలు తమకు కావాలని కోరుకుంటున్నరు. ఈ మధ్యే మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకా సర్పంచుల ఫోరం సభ్యులు నిర్మల్కు వచ్చి కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే తాము పూర్తిగా మద్దతు ఇస్తామని చెప్పారు. ఆయన వెంటే మేము ఉంటామని, వచ్చే ఎన్నికల్లో పోటీకి కూడా తాము సిద్ధమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీపై అక్కడి జనాల్లోనూ ఆసక్తి పెరిగింది.
నిర్మల్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ) : ప్రస్తుతమున్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. జాతీయ పార్టీ పెట్టాలి. ఎందుకంటే దేశంలో ఏ వ్యాపారి కూడా సంతోషంగా లేడు. ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా అని ఓ స్కీం పెట్టిండు. దీని కింద లోన్లు ఇస్తామన్నరు. చిన్న తరహా పరిశ్రమలను పైకి తెస్తామన్నరు. కాటన్ ఇండస్ట్రీని డెవలప్ చేస్తమన్నరు. ఇదంతా ఉత్తదే. దేశ వ్యాప్తంగా ఒక ప్రణాళిక అంటూ ఏదీ లేదు. ఎవరికి లోన్లు ఇస్తున్నరో, ఏ బ్యాంకులు ఇస్తయో తెలియదు. అంతా గందరగోళం, అయోమయం. ప్రకటనలే తప్ప మోదీ వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదు. జీఎస్టీ అంటూ ఇష్టా రీతిన ట్యాక్సులు వసూలు చేస్తున్నరు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యులకు ఏదీ అందుబాటులో లేదు. రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. ఎగుమతులు, దిగుమతులు తగ్గిపోయినయ్. వాహనాలకు సంబంధించి చిన్న చిన్న విడిభాగాలపై 28 శాతం జీఎస్టీ విధిస్తున్నరు. దీంతో విడిభాగాల ధరలు పెరిగాయి. వాహనాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో దసరా, దీపావళి పండుగ సీజన్లో 300 వాహనాలు అమ్మే వాళ్లం. ఇప్పటికీ 10 బండ్లు కూడా అమ్మలేదు. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. దీనంతటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే కారణం. ఇలాంటి ప్రభుత్వం మారాలంటే సీఎం కేసీఆర్ రావాలి. ఆయన పేదల పక్షపాతి. ఆయన దేశ రాజకీయాల్లోకి వస్తే అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది. – అజయ్, వ్యాపారి, నిర్మల్
నిర్మల్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ దూరదృష్టితో తెలంగాణ రాష్ర్టాన్ని అభివృధ్ధి చేసినట్లుగానే దేశాన్ని కూడా ప్రగతి పథంలో నడిపిస్తారన్న నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉన్నది. దశాబ్దాలుగా ఉత్తరాది పార్టీలకు చెందిన నాయకులు ఢిల్లీ పీఠంపై కూర్చొని మన రాష్ర్టాన్ని చిన్న చూపు చూస్తున్నారు. ముఖ్యంగా రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లో ప్రతీసారి తెలంగాణకు అన్యాయమే జరుగుతున్నది. రెక్కాడితేగాని డొక్కాడని పేదోళ్లపై కేంద్ర ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరిస్తు న్నది. పెరిగిన గ్యాస్, పెట్రోల్, నిత్యావసర ధరలతో పూట గడవడమే కష్టంగా మారింది. ఇక్కడ సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే… కేంద్ర ప్రభుత్వం పన్నుల పేరుతో దోచుకుంటున్నది. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో కేసీఆర్వంటి విజన్ ఉన్న నాయకులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే భారతదేశం ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది.
– లక్ష్మణాచారి, నిర్మల్
సిరికొండ, అక్టోబర్ 4 : రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపాడు. అన్ని వర్గాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు. రైతుల కోసం రైతు బీమా, రైతుబంధు వంటి పథకాలు అందిస్తున్నడు. వ్యవసాయ రంగానికి ప్రాణం పోశారు. ఇవే పథకాలు దేశమంతటా అమలు కావాలంటే కేసీఆర్ వంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి.
– ఓరగంటి పెంటన్న, మాజీ సర్పంచ్, సిరికొండ.
నిర్మల్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ) : ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి మంచి నాయకత్వం అవసరం. కేసీఆర్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. తెలంగాణలో ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే సీఎం కేసీఆర్ దేశ ప్రధాని కావాలి. ఆయన మంచి విజన్ ఉన్న నేత. ఇప్పుడున్న పరిస్థితుల్లో కులం, మతం వంటి అంశాల కన్నా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పని చేసే నిరంతర శ్రమ జీవి కావాలి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ప్రజల గురించి ఆలోచించే కేసీఆర్ నాయకత్వంలో దేశం అభివృధ్ది బాటలో పయనిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
– ఎస్.గజానంద్, భైంసా