అక్రమ కట్టడాలకు చెక్ పెట్టడానికి, ఆస్తిపన్ను వంద శాతం వసూలు కావడానికి, ఇండ్ల స్థలాల పంపిణీ, రుణాలు, సామాజిక పింఛన్లు, సంక్షేమ పథకాలు అర్హులకు పారదర్శకంగా అందడానికి ప్రతి ఇంటికి ఆధార్ సంఖ్యను లింక్ చేయాలని సర్కారు భావించింది. ఈ మేరకు పట్టణంలోని 42 వార్డుల్లో మున్సిపల్ సిబ్బంది ఏడు బృందాలుగా ఇంటింటికీ తిరుగుతూ వంద శాతం సర్వే పూర్తి చేశారు. జీఐఎస్(జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం) ద్వారా ఇంటి కొలతలను నమోదు చేశారు. నిర్మల్ బల్దియాలో 88,433 మంది జనాభా ఉందని, 22,672 ఇండ్ల నుంచి ఆస్తి పన్ను వసూలవుతుందని తేల్చారు. ఇంకా.. అదనంగా 2,206 ఇండ్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో మున్సిపాలిటీకి పన్ను ఎగ్గొడుతున్న వారి ఆటకు అడ్డుకట్ట పడ్డట్లేనని అధికారులు పేర్కొంటున్నారు.
నిర్మల్, అక్టోబర్ 13(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృధ్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా అందడానికి ప్రతి పథకానికి ఆధార్ సంఖ్యను లింక్ చేయాలని సర్కారు భావించింది. ఇందులో భాగంగా మున్సిపల్ రికార్డుల్లో ఇంటి నంబర్ ఉన్న వారిని గుర్తించి, వారి ఆస్తుల వివరాలు ఆధార్తో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. నిర్మల్ బల్దియాలో 88,433 మంది జనాభా ఉండగా.. 22,672 ఇండ్ల నుంచి ఆస్తి పన్ను వసూలవుతున్నది. ఇటీవల నిర్వహించిన జీఐఎస్ సర్వే ద్వారా కొత్తగా ప్రతి ఇంటి కొలతలు తీసుకొన్నారు. అంతకు ముందు ఇండ్ల నిర్మాణాలు జరిగినా, అనుమతికి మించి కట్టడాలు నిర్మించినా, ఆస్తి పన్ను వసూలయ్యేది కాదు. ప్రజాప్రతినిధుల అండదండలు, కార్యాలయ సిబ్బంది సహకారంతో వ్యవహారం నడిచేది. కానీ.. వంద శాతం సర్వే పూర్తి కాగా.. అదనంగా 2,206 ఇండ్లు వెలుగులోకి వచ్చాయి. ఇకపై ఇండ్ల స్థలాల పంపిణీ, రుణాలు, సామాజిక పింఛన్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, రూపాయికే నల్లా కనెక్షన్ వంటి పథకాలు అసలైన లబ్ధిదారులకు దక్కేందుకు ఆధార్ అనుసంధానం దోహదం చేస్తుందని అధికారులు చెబుతున్నారు.
పన్ను ఎగవేతదారులకు చెక్..
నిర్మల్ పట్టణంలో ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా పన్నులు వసూలు చేసే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. కొత్తగా ఇండ్లు నిర్మించుకున్న వారి ఆస్తి పన్ను కొలతల నిర్ధారణలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించడంతో బల్దియా నష్టపోయేదని తేలింది. అనుమతులకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించడం, ఇంటి కొలతలు తక్కువ చేసి చూపించడం, నివాసానికి అనుమతులు తీసుకొని కమర్షియల్గా వాడుకోవడం వంటి వ్యవహారాలు వెలుగు చూశాయి. ఆస్తిపన్ను, నీటి కుళాయిల బకాయిలు, ట్రేడ్ లైసెన్స్(వ్యాపార ధ్రువీకరణ పత్రం) ద్వారా ఆదాయం రాబట్టడానికి జీఐఎస్(జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం) ద్వారా ఛాయా చిత్రాల ద్వారా సర్వే సత్ఫలితాలను ఇచ్చింది. సర్వేలో తేలిన అంశాల ఆధారంగా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆస్తిపన్నును నిర్ధారించనున్నారు. పట్టణంలోని 42 వార్డుల్లో ఏడు బృందాలు చేపట్టిన సర్వేలో తేలిన ఇండ్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. కాగా.. జీఐఎస్ విధానంతో ఇంటి కొలతలు పక్కాగా తేలడంతో ఆస్తిపన్ను వసూలు చేయనున్నారు. మున్సిపాలిటీకి పన్నులు ఎగ్గొడుతున్న వారి ఆటలకు అడ్డుకట్ట పడ్డట్లేనని అధికారులు అంటున్నారు.
100 శాతం పూర్తి చేశాం..
నిర్మల్ పట్టణంలోని 42 వార్డుల పరిధిలో ప్రతి ఇంటికి ఆ ఇంటి యజమాని ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేశాం. అలాగే జీఐఎస్ సర్వే ద్వారా ఇంటి కొలతలను నమోదు చేశాం. దీని ద్వారా ఇకపై 100 శాతం ఆస్తి పన్ను వసూలు చేయనున్నాం. ఇప్పటివరకు అదనంగా నిర్మించుకున్న కట్టడాలు పన్ను పరిధిలో లేకుండే. అలాంటి కట్టడాలతోపాటు, వాణిజ్య సముదాయాలు, ఇంటి అనుమతి తీసుకొని నిర్మించిన భవనాల్లో వ్యాపారాల నిర్వహణ.. మొదలగు వాటిని జీఐఎస్ ద్వారా గుర్తించగలిగాం. దీంతో పన్ను ఎగవేతదారులకు అడ్డుకట్ట వేసినైట్లెంది. – ఏ.సంపత్కుమార్, మున్సిపల్ కమిషనర్, నిర్మల్.