నిర్మల్ అర్బన్, జనవరి 9 : జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ 50వ రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక పర్యావరణ, ఇన్స్పైర్ అవార్డ్, మనాక్ ప్రదర్శనలను సోమవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దేవాదాయ, అటవీ, పర్యావరణ, న్యా య, రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ దేవసేన అట్టహాసంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి విద్యార్థులు గైడ్ టీచర్లతో హాజరయ్యారు.
రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్కు జూనియర్, సీనియర్ విభాగంలో మొత్తం 451 ప్రదర్శనలు వచ్చాయి. ఇన్స్పైర్ మేళాకు 257 ప్రదర్శనలు, గిరిజన పాఠశాలల నుంచి 23, టీచర్ ఎగ్జిబిట్లు 26, ట్రైనీ బీఎడ్లు 5, సెమినార్కు 18 ప్రదర్శనలు వ చ్చినట్లు జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. విద్యార్థులు తీసుకువచ్చిన ప్రదర్శనలను రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద ఎంట్రీ చేసుకున్నారు. ప్రతీ రూములో ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్లను ఓపికతో తిలకించి వాటి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర స్థాయికి ఎంపికైన ప్రదర్శనలు తిలకించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆశ్చర్యానికి గురయ్యారు. పాఠశాల స్థాయి నుంచే శాస్త్ర సాంకేతిక రంగాలపై వారికి ఉన్న తెలివి తేటల గురించి తెలుసుకొని అభినందించారు. జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చి తెలంగాణ రాష్ర్టానికి గుర్తింపు తీసుకురావాలని సూచించారు.
రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ ప్రదర్శనల ప్రారంభోత్సవం సందర్భంగా సెయింట్ థామస్ పాఠశాల, శాంతినగర్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలతో హోరెత్తించారు. అలాగే వివిధ పాఠశాలల ఎన్సీసీ, స్కౌట్ విద్యార్థులు చేపట్టిన గౌరవ వందనం ఆకట్టుకున్నది.
ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఐకే రెడ్డి, ఎస్సీఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ దేవసేన, ఎమెల్యేలు విఠల్ రెడ్డి, రేఖానాయక్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీలను ఘనంగా సత్కరించి మెమొంటోలు అందజేశారు.
జిల్లాలోని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ముథోల్ ఎమెల్యే విఠల్ రెడ్డి, ఖానాపూర్ ఎమెల్యే రేఖా శ్యాంనాయక్ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. బాసర మండలంలో బాలికల విద్యార్థుల కోసం కేజీబీవీ పాఠశాలను ప్రారంభించాలని, మన ఊరు-మన బడి కార్యక్రమంలో ఏజెన్సీ పాఠశాలలను చేర్చి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను జీరో సర్వీస్ బదిలీ అనుమతించాలని టీయూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ సభ్యులు, డైట్, బీఎడ్ కళాశాలలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయాలని ఎమ్ఎడ్ టీచర్లు వినతి పత్రం అందించారు.