సోన్, జనవరి 9 : విద్య ద్వారానే విజ్ఞానం పొంది తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతులుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడులను బలోపేతం చేస్తూ కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నదని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ కింద చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. పాఠశాల సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులతో ముచ్చటించి విద్యా బోధన ఎలా ఉంది? మధ్యాహ్న భోజనం ఇస్తున్నారా? టీచర్లు బాగా చదువు చెబుతున్నారా? అంటూ ఆరా తీశారు. విద్యార్థులు సంతృప్తికర సమాధానం చెప్పడంతో సంతోషం వ్యక్తం చేశారు. మీ భవిష్యత్ కోసమే మీ పాఠశాలను ఇంత అందంగా తీర్చిదిద్దామని, బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. చిన్నప్పటి నుంచే ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా విద్యార్థులను ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
నిర్మల్ జిల్లాలో 38 పాఠశాలలను ‘మన ఊరు-మన బడి’ కింద మోడల్ పాఠశాలలుగా మొదటి విడుతలో అభివృద్ధి చేశామన్నారు. రెండో విడుతలో మిగిలిన పాఠశాలలను ఎంపిక చేస్తామని, కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో విద్యా సంస్కరణలు చేపట్టి నాణ్యమైన విద్యతోపాటు మానవ విలువలు పెంపొందించేలా కృషి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
అంతకుముందు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రైవేటు పాఠశాలలుగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ బడుల్లో తల్లిదండ్రులతో టీచర్ల సమావేశాలు నిర్వహించాలి. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హిమబిందు, సర్పంచ్ టి.వినోద్, జడ్పీటీసీ జీవన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్రెడ్డి, సోన్ బీఆర్ఎస్ మండల కన్వీనర్ మోహినొద్దీన్ పాల్గొన్నారు.