ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా, బోథ్ నియోజకవర్గంలో అత్యధికంగా 82.86 శాతం, మంచిర్యాలలో అత్యల్పంగా 69.06 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ప్రక్రియ కొనసాగగా, ఆ లోపు కేంద్రాల్లో ఉన్న వారందరికీ యంత్రాంగం ఓటేసే అవకాశం కల్పించడంతో పర్సంటేజ్ పెరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నది.
ఇక ఈవీఎంలు, వీవీ ప్యాట్లు స్ట్రాంగ్ రూముల్లోకి చేర్చి.. సీల్ చేసింది. ఆయాచోట్ల పోలీసుశాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. 3వ తేదీన ఓట్లు లెక్కించనుండగా, విజేతలెవరో తేలిపోనున్నది. ఇక గెలుపుపై ఎవరి అంచనాల్లో వారు ఉండగా, పోలింగ్ సరళిపై క్యాడర్ లెక్కలేసుకుంటున్నది. మండలాలు, గ్రామాల వారీగా వచ్చే లీడ్పై చర్చించుకుంటున్నది.
– ఆదిలాబాద్,డిసెంబర్1(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్ /కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్1(నమస్తేతెలంగాణ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఎ లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. గురువారం ఉదయం 7గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5గంటల దాకా కొనసాగింది. పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లో నిల్చు న్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ తీరును జిల్లా ఎన్నికల అధికారులు ఎప్పటికప్పడూ గమనిస్తూ అధికారులు, సిబ్బందికి తగిన సలహాలు,సూచనలు అందజేశారు.
పోలిం గ్ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బోథ్ నియోజకవర్గంలో అత్యధికంగా 82.86 శాతం, మంచిర్యాలలో అతి తక్కువగా 69.06శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ అనంతరం అధికారులు ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, కంట్రోల్ యూనిట్లను ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు తరలించారు. 10 నియోజకవర్గాల్లో ఏర్పా టు చేసిన స్ట్రాంగ్ రూంలలో ఈవీఎంలను అధికారులు భద్రపర్చి సీల్ చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్టమైన పోలీసుబందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీలు శుక్రవారం స్ట్రాంగ్ రూములను పరిశీలించి భద్రతను పరిశీలించారు.
ఈ ఎన్నికల్లో ప్రజా నిర్ణయం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. భద్రంగా స్ట్రాంగ్ రూముల్లోకి చేరింది. గురువారం రాత్రి వరకు పోలింగ్ నిర్వహించిన అధికారులు ఎన్నికల సామగ్రిని బందోబస్తుతో స్ట్రాంగ్ రూముల్లోకి చేర్చారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లోకి చేర్చారు. కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్రావు, ఎస్పీ సురేశ్కుమార్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల బాక్స్లకు స్ట్రాంగ్ రూంలో ఉంచి సీల్ వేశారు. ఈ నెల 3న ఓట్ల లెక్కింపుకోసం ఏర్పాట్లను ప్రారంభించారు. స్ట్రాంగ్ రూం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.
గురువారం నాటి పోలింగ్తో ఎన్నికల నిర్వహణలో ముఖ్యఘట్టాలు ముగిశాయి. ఇక మిగిలింది స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచిన ఈవీఎంలను తెరిచి ఈ నెల 3న ఓట్ల లెక్కించి ఫలితాలను వెళ్లడించడమే. గురువారం జరిగిన పోలింగ్ సరళి.. తమ తమ గెలుపు అవకాశాలపై పోటీలో ఉన్న అభ్యర్థులు తమ అనుచరులతో అంచానాలు వేసుకుంటున్నారు. ఏయే మండలాల నుంచి ఏ గ్రామాల్లో తమకు ఓట్లు ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి.
ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో తమకు లీడ్ వస్తుందనే విషయాలపై అభ్యర్థులు అనుచరులతో అంచనాలు వేసుకుంటున్నారు. మండలాల వారీగా కార్యకర్తలను ఇంటికి పిలిపించుకొని ఆరా తీస్తున్నారు. ఇక గిరిజన గ్రామాల్లో రాత్రి వరకు పోలింగ్ జరుగడం.. గతంలో కంటే ఎక్కువ శాతం పోలింగ్ నమోదు కావడంతో ఎంతవరకు గెలుపునకు అవకాశాలు ఉన్నాయనే విషయాలను చర్చించుకుంటున్నారు.