ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన వైద్యరంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. సర్కారు దవాఖానల్లో పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నది. వైద్య విద్యకు కూడా ప్రోత్సాహమందిస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్కు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేసింది. వైద్య విద్యార్థులకు వివిధ విభాగాల్లో ఉన్నత చదువులు చదువుకునేందుకు ప్రభుత్వం సహాయ, సహకారాలు అందిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రిమ్స్(రాజీవ్గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో పదహారు విభాగాల్లో 72 మంది విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం కల్పించింది. ఫలితంగా పేదలకు వైద్యసేవలు మెరుగుపడనున్నాయి.
– ఆదిలాబాద్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో వైద్య రంగాన్ని గత పాలకులు విస్మరించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సమైఖ్య పాలనలో ఆదిలాబాద్ జిల్లావాసులకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. మూరుమూల గ్రామాలు, ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో సీజనల్ వ్యాధుల కారణంగా మరణాలు సంభవించేవి. వచ్చిన రోగాన్ని తగ్గించుకునేందుకు ప్రజలు హైదరాబాద్తోపాటు మహారాష్ర్టలోని నాగ్పూర్, యావత్మాల్ లాంటి పట్టణాల్లోని కార్పొరేట్ దవాఖానలను ఆశ్రయించేవారు. భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వైద్యరంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది నియామకంతోపాటు ముందులు, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచారు. గర్భిణులు ప్రసవానికి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేయకుండా.. సర్కారు దవాఖానల్లో డెలివరీలు అయ్యేలా అన్ని వసతులు కల్పించింది. ఫలితంగా ప్రజలు సర్కారు వైద్య సేవలు పొందుతూ ఆరోగ్యంగా ఉంటున్నారు. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు రిమ్స్లో చికిత్స పొందుతున్నారు.
ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువకావడంతోపాటు విద్యార్థులు తమ బంగారు భవిష్యత్ను తీర్చిదిద్దుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా జిల్లాకు ఒక వైద్య కళాశాలను ప్రభు త్వం ఏర్పాటు చేసింది. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ రిమ్స్తోపాటు మంచిర్యాల, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో వైద్యకళాశాలలు ఏర్పాటు చేసి, ఈ ఏ డాది ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించింది. రిమ్స్లో నాలుగేండ్లుగా వైద్యవిద్య పీజీలో ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం పీజీ సీట్లను గణనీయంగా పెంచింది. 16 విభాగాల్లో 72 సీట్లను కేటాయించారు. అనస్తీషియా, జనరల్ మెడిసిన్లో ఏడేసీ సీట్ల చొప్పున, జనరల్ సర్జరీలో ఆరు, అటానమీ, ఫిజియాలజీ, ఫార్మాకాలేజీ, ఎస్పీఎం, టీబీసీడీ, డీవీఎల్, ఆర్థోపెడిక్లో ఐదు సీట్ల చొప్పున, పాథాలజీలో నాలుగు, బయోకెమిస్ట్రీ, ఆప్తమాలజీ, ఈఎన్టీలో మూడేసీ సీట్ల చొప్పున, ఫోరెన్సిక్ మెడిసిన్, గైనకాలజీలో రెండేసి చొప్పున పీజీ సీట్లు మంజూరు చేసింది. ఇటీవల కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన పీజీ మొదటి విడుత కౌన్సెలింగ్లో రిమ్స్లో పీజీ అనస్తీషియాలో ఇద్దరు, డెర్మటాలజీలో ఇద్దరు, ఈఎన్టీలో ఇద్దరు, జనరల్ మెడిసిన్లో ఇద్దరు, జనరల్ సర్జరీలో ఇద్దరు, ఆప్తమాలజీలో ఒకరు, ఆర్థోపెడిక్లో ఇద్దరు, పాథాలాజీలో ఇద్దరు, పల్మనాలజీలో ఇద్దరు విద్యార్థులు చేరారు. మరో రెండు విడుతల కౌన్సెలింగ్ ఉండగా.. పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కానున్నట్లు అధికారులు తెలిపారు. వివిధ విభాగాల్లో పీజీ విద్యార్థులు చేరిక ఫలితంగా ప్రజలకు వైద్యసేవలు మెరుగుపడనున్నాయి.
వైద్య విద్యలో పీజీ చేసే విద్యార్థులకు రిమ్స్ అనుకూలమైంది. వివిధ రకాల వ్యాధులతో ప్రజలు, ఎమర్జెన్సీ కేసులు ఎక్కువ వస్తుండడంతో వారికి పలు అంశాలను నేర్చుకునే అవకాశం లభిస్తున్నది. వివిధ విభాగాల్లో నిపుణులైన సీనియర్ వైద్యుల వద్ద పలు అంశాలు తెలుసుకోవచ్చు. పేదలు, గిరిజనులకు సేవ చేసే అవకాశం లభిస్తుంది.
– రాథోడ్ జైసింగ్, రిమ్స్ డైరెక్టర్, ఆదిలాబాద్