వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. నల్లగొండ జిల్లాలో మొత్తం 14,26,480 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 7,08,924, మహిళలు 7,17,436 మంది ఉన్నారు. వీరితోపాటు 120 మంది ట్రాన్స్జెండర్లు ఓటరుగా నమోదు చేసుకున్నారు. పురుషుల కంటే 8,512 మంది అధికంగా మహిళా ఓటర్లు నమోదు కావడం గమనార్హం. కొత్త ఓటర్ల నమోదు చేసుకోవడానికి నామినేషన్ల దాఖలు తుది గడువుకు 10 రోజుల ముందు వరకు అవకాశం కల్పించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ) : జిల్లాలో గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య మరింతగా పెరిగింది. గత ఆగస్టు 21న విడుదల చేసిన ఓటర్ల ముసాయిదా జాబితాలో 13,84,525 మంది ఓటర్లుగా ఉన్నారు. అప్పటి నుంచి ఎన్నికల సంఘం ఆదేశం మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పుల గురించి సుమారు నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. 18 ఏండ్లు నిండిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తూనే పాత జాబితాలోని అనర్హులను ఏరివేయడం, చిరునామాల మార్పులు, తప్పొప్పుల సవరణకు అవకాశం కల్పించింది.
అందుకోసం ఆగస్టు 26,27 తేదీల్లో, సెప్టెంబర్ 2,3 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓలు అందుబాటులో ఉంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఇందులో రాజకీయ పార్టీలను, వివిధ విభాగాల అధికారులను భాగస్వాములను చేసింది. స్పెషల్ డ్రైవ్లో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించి చర్యలు చేపట్టారు. వీటన్నింటి తర్వాత బుధవారం ఓటర్ల తుది జాబితాను వెల్లడించారు. ముసాయిదా జాబితాతో పోలిస్తే నల్లగొండ జిల్లాలో తుది జాబితాలో 41,955 మంది ఓటర్లుగా అదనంగా వచ్చి చేరారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే దేవరకొండలో 10,252, నాగార్జునసాగర్లో 5,149, మిర్యాలగూడలో 6,930, నల్లగొండలో 7,722, మునుగోడులో 5,248, నకిరేకల్లో 6,654 మంది ఓటర్లు కొత్తగా నమోదయ్యారు. అయితే నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండడం విశేషం. దేవరకొండ, మునుగోడుల్లో మాత్రమే పురుష ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది.
జిల్లాలో తుది పోలింగ్ కేంద్రాల సంఖ్యను కూడా ఖరారు చేశారు. తాజాగా జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 1,766 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే గతంలో 1747 కేంద్రాలే ఉండగా అదనంగా 19 పోలింగ్ కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేశారు. నల్లగొండ నియోజకవర్గంలో 3, మిర్యాలగూడలో 7, మునుగోడులో 9 పోలింగ్ కేంద్రాలు పెరుగడంతో మొత్తం సంఖ్య 1,766కు పెరిగినట్లు ఎన్నికల అధికారుల వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల ఎంపిక విషయంలోనూ కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కొత్తగా ఓటు నమోదుకు చివరి అవకాశం కూడా కల్పించారు. నామినేషన్ల దాఖలుకు తుది గడువుకు పది రోజుల ముందు వరకు ఓటర్ నమోదు అవకాశం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమని ప్రకటించారు.