పాండురంగడి సన్నిధిలో సప్తమి ఉత్సవాలు ప్రారంభం
యాదవ, ఆర్యవైశ్య, మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు
డిసెంబర్ 3న ముగింపు
కుభీర్, నవంబర్ 28: తెలుగింటి పండరీపురంగా ఖ్యాతి గాంచిన కుభీర్లోని శ్రీవిఠలేశ్వర ఆలయంలో సప్తమివేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రలోని ప్రసిద్ధ పండరీపురం పుణ్యక్షేత్రం మాదిరిగానే ఇక్కడ ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలు కొనసాగుతాయి. వందల ఏళ్ల నాటి నుంచి నేటికీ ఈవేడుకలు కొనసాగుతున్నాయి. అతి పురాతన ఆలయాల్లో ఈక్షేత్రం ఒకటి. కుభీర్తో పాటు మండల, నియోజకవర్గంలోని ప్రజలకు విఠలేశ్వరుడంటే ఎనలేని భకి,్త విశ్వాసం.
చరిత్ర..
వందల ఏళ్లకు పూర్వం కుభీర్ దొరల పాలనలో కొనసాగేది. అప్పుడు ఇక్కడి ప్రాంతం మహారాష్ట్రలో ఉండేది. ఇద్దరు మక్తా దొరలు యశ్వంత్రావు, త్రియంబక్రావు పాలించేవారు. యశ్వంత్రావుకు కలలో పాండురంగడు కనిపించి కుభీర్లో విఠలేశ్వరుడు -రుక్మిణీ విగ్రహాలను ప్రతిష్టించాలని చెప్పారట. దీంతో పండరీపురం నుంచి తెచ్చిన విగ్రహాలను ఇక్కడ ఓకే రోజులో ఆలయం నిర్మించి విగ్రహాలను ప్రతిష్టించారని చరిత్ర తెలిసిన వారు చెబుతుంటారు. దీంతో పాటు బాలాగంగాధర్ తిలక్, సంత్శ్రీ గాడ్గే మహారాజ్, యశ్వంత్రావు దేశ్ముఖ్తో కలిసి వినాయక చవితి ఉత్సవాలను సైతం ప్రారంభించారని చెబుతున్నారు. కుభీర్ నుంచే ఏటా కార్తీక, ఆషాఢ మాసాల్లో వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కార్తీక శుక్ల పక్షమి సప్తమిన ప్రారంభమయ్యే వేడుకలు చతుర్దశి రోజున అన్నదానంతో ముగుస్తాయి.
సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు
కుభీర్లోని యాదవ, మున్నూరుకాపు, ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఏడు రోజుల పాటు భజనలు, కీర్తనలు చేసే వారికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేస్తుంటారు. యాదవ, మున్నూరుకాపు సంఘాలు సప్తమి వేడుకలకు అయ్యే ఖర్చులు, చివరి రోజు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహిస్తారు. అన్ని కులాల వారు కలిసి కట్టుగా పనులు చేపడుతారు.
భక్తి శ్రద్ధలతో వేడుకలు
ఆలయంలో ఏటా సప్తమి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. మూడు సంఘాలు కలిసి ఈ వేడుకలను నిర్వహిస్తారు. వారం భజనలు, కీర్తనలు ఆలయంలో నిరంతరంగా కొనసాగుతాయి. ప్రతి రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు. ఏడు రోజులు అన్నదానం చేస్తారు. చివరి రోజు జిల్లాలోనే అతిపెద్ద అన్నదాన కార్యక్రమం 40-50 క్వింటాళ్ల బియ్యంతో వండిన అన్నం- పప్పును సామూహిక సహపంక్తి భోజనాల ద్వారా వడ్డించడం విశేషం. మహారాష్ట్రతో పాటు, జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు.
ముగింపు…
డిసెంబర్ 2న రాత్రికి ఆయా భజన బృందాలు భజనలు, కీర్తనలతో జాగరణ చేస్తాయి. ఉదయం(శుక్రవారం) కాకడ హారతి కార్యక్రమం, స్వామివారికి అభిషేకం, పట్టు వస్ర్తాల సమర్పణ, గ్రామంలో ఉత్సవ మూర్తులతో శోభాయాత్ర వైభవంగా నిర్వహిస్తారు. ఈ జాతరకు వేలాది మంది తరలి వస్తారు. కుభీర్లోని యువకులు, పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారు.