మహా జాతరకు పోటెత్తిన భక్తులు
పట్టు వస్ర్తాలు సమర్పించిన టీటీడీ ప్రతినిధులు
బోనాలతో మొక్కులు తీర్చుకున్న ప్రముఖులు
కౌటాల, నవంబర్ 28 : కౌటాల మండల కేంద్రంలోని కంకలమ్మ గుట్ట జనసంద్రమైంది. ఆదివారం నిర్వహించిన మహాజాతరకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నలుమూలల నుంచే గాకుండా పక్క రాష్ర్టాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. టీటీడీ తరఫున ధర్మ కార్యక్రమ సభ్యుడు చంద్రశేఖర్, ఉమ్మడి జిల్లా ప్రచారకర్త గొల్లపల్లి సత్యనారాయణ అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయగా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కౌటల మండల కేంద్రంలోని స్వయం భూ కంకలమ్మ కేతేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించిన మహా జాతరకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో జనం సంద్రంగా మారింది. అమ్మవారికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సతీమణి కోనే రు రమాదేవి, జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు సతీమణి కోనేరు రుక్మిణమ్మ బోనం సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ధర్మ కార్యక్రమ సభ్యుడు చంద్ర శేఖర్, ఉమ్మడి జిల్లా ప్రచార కర్త గొల్లపల్లి సత్యనారాయణ అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఉత్తరప్రదేశ్ మధుర బృందావనం శ్రీ కృష్ణ రాంజీ మందిర ఆశ్రమ స్వామిజీ శివరాం స్వామి, మహారాష్ట్ర దాబా కొండయ్య మహరాజ్ ఆలయ స్వామిజీ తులసీ రామేశ్వర్, చంద్రాపూర్ ఎమ్మెల్యే కిశోర్ జొరిగేవార్ బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మండలంతో పాటు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, గోదావరి ఖని, కరీంనగర్, మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల నుంచి దాదాపు 25వేల మంది భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వసతులు కల్పించారు. పూజా కార్యక్రమాల్లో కౌటాల, చింతలమానేపల్లి ఎంపీపీలు బసార్కర్ విశ్వనాథ్, డుబ్బుల నానయ్య, చింతలమానేపల్లి జడ్పీటీసీ డుబ్బుల శ్రీదేవి, కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్, కౌటాల సీఐ బుద్ధే స్వామి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో కౌటాల సీఐ స్వామి, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు బందో బస్తు నిర్వహించారు. సోమవారం కూడా ఉత్సవం కొనసాగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ సులువ కనకయ్య తెలిపారు.