.
ఉట్నూర్, అక్టోబర్28: సీఎం కేసీఆర్తోనే ఆదివాసుల అభ్యున్నతి సాధ్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, మాజీ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. దీపావళి సందర్భంగా గుస్సాడీ వేడుకలకు నిధులు కేటాయించినందున కృతజ్ఞతగా ఉట్నూర్లోని ఐటీడీఏ సమావేశ మందిరంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గతంలో ఆదివాసీ ప్రాంతాలను ఏ ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేదన్నారు. దండారీ ఉత్సవాల నిర్వహణకు ఏటా రూ. కోటి ముంజూరు చేస్తూ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఆదివాసుల ఆరాధ్య దైవం కుమ్రం భీం మ్యూజియం ఏర్పాటు, నాగోబా ఆలయం, ఇతర ఆధ్యాత్మిక ప్రాంతాలకు నిధులు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నిధుల మంజూరుకు సహకరించిన మాజీ ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే రేఖానాయక్ను నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్రావు, నర్సాపూర్-బీ సర్పంచ్ పెందూర్ కళావతి, మాజీ సర్పంచ్ బొంత ఆశారెడ్డి, ఆదివాసీ తొమ్మిది తెగల నాయకులు, గ్రామ పటేళ్లు, గిరిజనులు పాల్గొన్నారు.
మండలంలోని ముత్నూర్లో నిర్మించిన దుర్గాదేవి ఆలయంలో గురువారం గ్రామస్తులు ఆధ్వర్యంలో నిర్వహించిన హోమంలో ఎమ్మెల్యే రేఖానాయక్ పాల్గొన్నారు. ఆమె వెంట పీఏసీఎస్ చైర్మన్ మారుతి పటేల్ డోంగ్రే, నాయకులు దేవ్పూజె మారుతి, శ్రీరాంనాయక్, గ్రామస్తులు పాల్గొన్నారు.
పేదలకు అండగా సీఎం సహాయ నిధి
కడెం,అక్టోబర్28 : నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో కలిసి మండలంలో గురువారం ఆమె పర్యటించారు. లక్ష్మీపూర్, మద్దిపడగ, ధర్మాజీపేటలో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. మద్దిపడగ, నవాబ్పేటలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. అంబారిపేటకు చెందిన పార్టీ కార్యకర్తలు మహేశ్, రాకేశ్ ల తండ్రి మరణించగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ. 5 వేలు అందించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గోదాం ఏర్పాటుకు కృషి
ఉట్నూర్ రూరల్, అక్టోబర్ 28: మండలంలోని లింగోజితండాలో గోదాం ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రేఖానాయక్ తెలిపారు. ఐఎంల్ డిపోలో బుధవారం షార్ట్ సర్క్యూట్ జరుగగా ఎమ్మెల్యే గురువారం పరిశీలించారు. కార్మికులు వారి సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. కలెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్తో మాట్లాడి త్వరలో గోదాం ఏర్పాటు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. దీంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్రావు, సర్పంచ్ హరినాయక్, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, టీఆర్ఎస్ మండలాధ్యక్షడు రమేశ్, నాయకులు శ్రీరాం నాయక్, భూమన్న, కార్మిక సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థికి సన్మానం
పెంబి, అక్టోబర్ 28: తాటిగూడకు చెందిన గుగ్లావత్ జాలాసింగ్-చంద్రకళ దంపతుల కుమారుడు తరుణ్ జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో ఎస్టీ కేటగిరీలో 450 ర్యాంకు సాధించి ఐఐటీ గోవాలో సీటు పొందాడు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రేఖానాయక్ తరుణ్ను సన్మానించి అభినందించారు.కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ భుక్యా గోవింద్, నాయకులు రాజగంగన్న, విలాస్ ఉన్నారు.