రిపోర్టు చేసిన ఉద్యోగులు
30న ఉత్తర్వులు జారీ
ఆదిలాబాద్, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఒక జిల్లాలో పనిచేస్తూ ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఉద్యోగులు సంబంధిత శాఖల అధికారులకు రిపోర్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండ్రోజులుగా ఆప్షన్లను స్వీకరించగా.. ఈ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. జిల్లా కలెక్టర్, ఆయా శాఖల ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఉద్యోగుల కేటాయింపులు జరుగనున్నాయి. రెండ్రోజుల్లో ఈ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేసి ఈ నెల 30న బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. కాగా.. వివిధ శాఖల్లో సీనియారిటీ జాబితాతోపాటు ఖాళీలను అందుబాటులో ఉంచారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 67 శాఖల పరిధిలో 20,247 మంది ఉద్యోగులను ఆయా జిల్లాలకు అధికారులు కేటాయించారు. విభజనలో భాగంగా దాదాపు 5 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లి సంబంధిత శాఖల అధికారులకు రిపోర్ట్ చేశారు. వివిధ శాఖల్లో అధికారులు ఈ నెల 25న సీనియారిటీ జాబితాలు, ఖాళీలను తెలియజేశారు. వేరే జిల్లాల నుంచి ఆయా జిల్లాలకు వచ్చిన ఉద్యోగులు ఆది, సోమవారాల్లో ఆప్షన్లను ఇచ్చేకునే అవకాశం కల్పించారు. రెండ్రోజులుగా తమ కార్యాలయాల్లో ఆప్షన్లను స్వీకరించారు. బదిలీ అయిన వారు నిర్దేశించిన ఖాళీల్లో 20 ఆప్షన్లను ఎంచుకునే అవకాశం ఉంది. కొత్త జిల్లాల్లో అధికారులు సీనియారిటీ జాబితాను తయారు చేస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి వెళ్లిన ఉద్యోగాల ఖాళీలతోపాటు ప్రస్తుతం ఉన్న వాటిని గుర్తిస్తున్నారు. ఈ ఖాళీల్లో ప్రస్తుతం ఎక్కడ అత్యవసరమో అక్కడే కొత్తగా బదిలీ అయిన ఉద్యోగులకు పోస్టింగ్ ఇవ్వనున్నారు.
30న బదిలీ ఉత్తర్వులు జారీ
ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగుల ఆప్షన్ల స్వీకరణ పూర్తికాగా.. జిల్లా కలెక్టర్, ఆయా శాఖల ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఉద్యోగుల కేటాయింపులు జరుగనున్నాయి. రెండ్రోజుల్లో ఈ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేసి ఈ నెల 30 బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. విద్యాశాఖలో ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ ద్వారా కాకుండా వారు ఆప్షన్ ఇచ్చిన ప్రకారం పోస్టింగ్లు ఇవ్వనున్నారు. విద్యాశాఖ పరిధిలో ఖాళీలను గుర్తించడానికి అధికారులు పక్కగా మార్గదర్శకాలు అమలు చేశారు. పాఠశాల్లో ఎక్కడైతే పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంటుందో బడులు మూతపడే చోట ఖాళీలను గుర్తించారు. జిల్లా, మండలం కేంద్రాలకు దగ్గరగా ఉన్న స్కూళ్ల కంటే మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలలకు ప్రాధాన్యం కల్పించారు. జిల్లాలో మాధ్యమాలు, సబ్జెక్టులవారీగా 327 ఖాళీలను ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంచారు. జిల్లా పరిషత్ హాల్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి ప్రభుత్వం, స్థానిక సంస్థల యాజమాన్యాలతోపాటు ఆయా కేటగిరిలవారీగా దరఖాస్తులు స్వీకరించారు. బదిలీలో ప్రక్రియను కలెక్టర్, అదనపు కలెక్టర్లతోపాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు.