250 గ్రాముల గంజాయి, స్కూటీ స్వాధీనం
వివరాలు వెల్లడించిన డీఎస్పీ ప్రకాశ్
జగిత్యాల కలెక్టరేట్, డిసెంబర్ 27 : డిసెంబర్ 31, నూతన సంవత్సర ఆహ్వాన వేడుకల్లో గంజాయి అమ్మి సొమ్ము చేసుకుందామని స్కెచ్ వేసుకున్నారు ముగ్గురు యువకులు. ఇతర జిల్లాల నుంచి గంజాయిని తీసుకు వచ్చి ప్యాకెట్లుగా మార్చి అమ్మేందుకు వస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. జగిత్యాల డీఎస్పీ ఆర్ ప్రకాశ్ జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. కొడిమ్యాలకు చెంది న రోహన్, జగిత్యాల పట్టణానికి చెందిన సాయికృష్ణ, సాయిచంద్, పృథ్వీధర్, చందు గంజాయికి అలవాటు పడ్డారు ఈ క్రమంలో వీరు ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి యువకులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. 2021 వీడ్కోలు, నూతన సంవత్సర ఆహ్వాన వేడుకలకు యువకులు గంజాయి ఎక్కువగా సేవిస్తారని భావించిన సాయికృష్ణ, సాయిచంద్, రోహన్ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రాంతం నుంచి గంజాయి తీసుకొచ్చారు. వీటిని ప్యాకెట్లలో ఉంచి అమ్మేందుకు ఆదివారం స్కూటీపై వెళ్తున్నారు. ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల వద్ద జగిత్యాల టౌన్ సీఐ కోరె కిశోర్ వాహనాలు తనిఖీ చేస్తుండగా స్కూటీపై రోహన్, సాయిచంద్, సాయికృష్ణ అనుమానాస్పదంగా కనిపించారు. వారి వాహనాన్ని తనిఖీ చేయగా 250 గ్రాముల గంజాయి పట్టుబడింది. జగిత్యాల అర్బన్ తహసీల్దార్తో పంచనామా చేయించారు. గంజాయి, స్కూటీని స్వాధీనం చేసుకొని యువకులను అరెస్ట్ చేశారు. వీరితో సంబంధమున్న పృథ్వీధర్, చందు పరారీలో ఉన్నారని, వీరిని త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టు ఆంక్షలు విధించిన నేపథ్యంలో తల్లితండ్రులు పిల్లలను బయటకు పంపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో టౌన్ సీఐ కోరె కిశోర్, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, జీవన్, మల్లేశం పాల్గొన్నారు.