అధికారులు పనితీరు మార్చుకోవాలి
వట్టివాగు కెనాల్లో సిల్ట్ తీయించి సాగు నీరందించాలి
జడ్పీ స్థాయీ సంఘం సమావేశంలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి
ఆసిఫాబాద్, ఆగస్టు27: జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి సూచించారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారుల తీరుపై జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలాల్లో అధికారులు కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదన్నారు. అభివృద్ధి పనులు శంకుస్థాపనలకు స్థానిక ఎంపీపీ, జడ్పీటీసీలను ఆహ్వానించకపోడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు ఎంతో కృషి చేసి నిధులు తీసుకువస్తే అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఐటీడీఏ అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడం సరికాదని, సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రశ్నించారు. ధనోర వద్ద ప్రధాన రహదారిలో మిషన్ భగీరథ నీరు వృథాగా పోతున్నదన్నారు. కొంత మంది ప్రజలు తాగేందుకు నీరు లేక ఇబ్బందులు పడుతుంటే, తాగునీరు వృథాగా పోవడమేంటని మిషన్భగీరథ అధికారిని ప్రశ్నించారు.
వెంటనే మరమ్మతులు చేసి, అక్కడ ప్రజలకు ఉపయోగ పడేలా కుళాయి ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలో పైపు లైన్ పూర్తయినప్పటికీ నీరు అందించడం లేదని తెలుసుకున్నారు. కుమ్రంభీం ప్రాజెక్టు బ్యాక్వాటర్తో మానిక్గూడ వద్ద రోడ్డుకోతకు గురైందని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులును ఆదేశించారు. వట్టివాగు ప్రాజెక్టు కెనాల్లో పూడిక తీయించి రైతులకు సాగునీరు అందించాలని ఈఈ ని ఆదేశించారు. దహెగాం నుంచి కాగజ్నగర్ వచ్చే దారిలో బ్రిడ్జికి స్లాబ్ వేసి అప్రోచ్ రోడ్డు వేయాలని జడ్పీటీసీ రామారావు అధికారులను కోరారు. ఏజెన్సీ ప్రాంతంలోని భూ ములకు, లావొని పట్టాలకు విరాసత్ చేసేందుకు ప్రభుత్వం ఆప్షన ఇచ్చిందని అధికారులు వెంటనే సర్వే చేసి రైతులను న్యాయం చేయాలని వాంకిడి జెడ్పీటీసీ సంతోష్ కోరారు. జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ, జడ్పీటీసీ అజయ్, వివిధ స్థాయీ సంఘాల సభ్యులు పలు సమస్యలను వివరించారు కార్యక్రమంలో వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.