సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్
కలెక్టరేట్లో సమావేశం
హాజరైన అదనపు కలెక్టర్ రాజేశం, వైద్యులు,యువజనల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు
ఆసిఫాబాద్, ఆగస్టు27: ప్రజల భాగస్వామ్యంతో రెడ్క్రాస్ సొసైటీ సేవలను విస్తరిస్తామని సంస్థ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ రాజేశం, సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరెడ్డితో కలిసి జిల్లాలోని వైద్యులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని గిరిజనుల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉందన్నారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సంస్థను అభివృద్ధి చేయాలని, ఇందుకోసం తెలంగాణ రెడ్క్రాస్ సొసైటీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని సభ్యులుగా చేరాలన్నారు. ఇందుకు ప్రతి సభ్యుడు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుందని, స్వచ్ఛంద సేవలో భాగంగా ఆ నిధిని ఉపయోగిస్తామని చెప్పారు.
జిల్లాలో సంస్థ చైర్మన్గా కలెక్టర్ వ్యవహరిస్తారన్నారు. జిల్లా నుంచి సమకూరిన నిధిలో 70 శాతం ఇక్కడికే కేటాయిస్తామని, మిగతా 30 శాతం సంస్థ వద్ద ఉంటుందన్నారు. ఇందులో నుంచి 50 శాతం కేంద్ర సంస్థలకు పంపిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో 100 మంది సభ్యులతో ప్రారంభించాలని అనుకుంటున్నామని తెలిపారు. రక్తనిధి సేకరణతో అత్యవసరాల్లో రక్తం అందించే అవకాశం ఉంటుందన్నారు. రక్తదానంపై అపోహలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాలని సూచించారు. జిల్లాలో ప్రస్తుతం అడ్హక్ కమిటీ వేసుకొని అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటే సొసైటీ నుంచి పూర్తి సహకారం అందుతుందన్నారు. వరంగల్, నిజామాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల జిల్లాల్లో సభ్యత్వం కోసం పోటీ ఉందన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ రాజేశం మాట్లాడుతూ జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీని విస్తృత పరిచేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం సంస్థ సభ్యులను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో డీఆర్వో కదం సురేశ్, ఆర్డీవో సిడాం దత్తు, డీఎంహెచ్వో మనోహర్, యువజన సం ఘాలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.