జీపీల్లో ఈ-ఆడిట్ విధానం అమలు
ఎప్పటికప్పుడు ఆన్లైన్లో వివరాలు
గతేడాది 640 గ్రామాల్లో పూర్తి
త్వరలో మిగతా చోట్ల అమలుకు కసరత్తు
నిధుల వినియోగంలో పారదర్శకతకు సర్కారు చర్యలు
ఆదిలాబాద్, ఆగస్టు 27 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లె ప్రగతితో పాటు వివిధ కార్యక్రమాల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన లెక్కలు పక్కాగా నమోదు చేసి పారదర్శకత పాటించేందుకు సర్కారు కృషి చేస్తున్నది. ఈ మేరకు ప్రతి గ్రామ పంచాయతీలో ఈ ఆడిట్ విధానాన్ని అమలు చేస్తుండగా, అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు నిధులు, పన్నులు, ఖర్చులు తదితర వివరాలను ఆన్లైన్లో పొందుపరిచి ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1508 జీపీలు ఉండగా, ఇప్పటికే 640 చోట్ల పూర్తి చేసింది. త్వరలో మిగతా చోట్ల అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన గ్రామాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే పల్లె ప్రగతి ద్వారా అనేక అభివృద్ధి పనులు చేపట్టింది. పంచాయతీలకు ట్రాక్టర్లను మంజూరు చేయడమే కాకుం డా పల్లెల్లో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, కంపోస్ట్ షెడ్లను సైతం నిర్మించింది. ఉమ్మడి జిల్లా లో ఇప్పటికే పలు గ్రామాలు ఉత్తమ పంచాయ తీలుగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకున్నాయి. పంచాయతీలకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం వాటి వినియోగంలో పారదర్శకత పాటించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా పంచాయతీల్లో ఈ-ఆడిటింగ్ విధానం అమలు చేస్తున్నది. జమ, ఖర్చులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
ఇప్పటికీ 640 జీపీల్లో..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1508 గ్రామ పంచాయతీలుండగా, గతేడాది నుంచి 640 పంచాయతీల్లో ఈ- ఆడిట్ అమలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 467 గ్రామ పంచాయతీలు ఉండగా, 221 పంచాయతీల్లో ఈ ఆడిట్ పూర్తి చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 334 పంచాయతీలకుగాను 155, మంచిర్యాల జిల్లాలో 311 పంచాయతీలకుగాను 66 పంచాయతీల్లో, నిర్మల్ జిల్లాలో 396 గ్రామ పంచాయతీలుండగా, 198 పంచాయతీల్లో ఆడిట్ వివరాలను అధికారులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఈ విధానంవిజయవంతంగా అమలవుతుండడంతో త్వరలో మిగతా గ్రామ పంచాయతీల్లోనూ అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీల్లో పాత పద్ధతిలో ఆడిట్ నిర్వహించడంతో నిధుల వినియోగానికి సంబంధించిన వివరాలు అధికారులకు మాత్రమే తెలిసేది. ఇప్పుడు కొత్తగా అమలు చేస్తున్న ఈ- ఆడిట్ విధానం ద్వారా పంచాయతీల నిధుల వివరాలను ప్రజలు తెలుసుకునే అవకాశాలున్నాయి.