పల్లెల్లో ప్రైవేట్ వ్యాపారుల దూది కొనుగోళ్లు
ఆపై అక్రమంగా మహారాష్ట్రకు తరలింపు
రైతుల పేరిట దళారుల దందా
అధికారులు పట్టించుకోవడం లేదంటున్న జిన్నింగ్ వ్యాపారులు
ఆసిఫాబాద్, డిసెంబర్ 26 : పత్తిచేతికొచ్చినప్పటి నుంచి, దళారులు పల్లెల్లో రాబంధుల్లా వాలిపోతు న్నారు. మహారాష్ట్రలో మంచి డిమాండ్ ఉండగా.. ఇదే అదనుగా భావించి ఇక్కడి పత్తిని కొనుగోలు చేసి.. రైతుల పేరిట అడ్డదారిలో అక్కడికి తరలించుకుపోతున్నారు. ఇప్పటికే మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి ఎలాంటి ట్యాక్స్లు చెల్లించకుండా దాదాపు లక్ష క్వింటాళ్ల దూది తీసుకెళ్లినట్లు తెలుస్తుండగా, రాష్ట్ర ఖజానాకు రూ. 2 కోట్ల నష్టం జరిగింది. అధికారుల పట్టింపు లేనితనంతోనే అక్రమ రవాణా జరుగుతుందని జిన్నింగ్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ఏడాది 3 లక్షల 17 వేల ఎకరాల్లో పత్తి సా గు చేయగా, సుమారు 30 లక్షల క్వింటాళ్ల దిగుబడి వ స్తుందని అధికారులు అంచనా వేశారు. గతేడాదితో పో లిస్తే ఈసారి పత్తి దిగుబడి తక్కువగా ఉంది. ప్రస్తుతం దూది ధరలకు రెక్కలు వచ్చాయి. తెలంగాణలో క్వింటాలుకు ధర రూ. 8400 వరకు ఉండగా, మహారాష్ట్రలో రూ. 8600 వరకు పలుకుతున్నది. ఇదే అదనుగా భా వించిన దళారులు ఇక్కడి పత్తిని కొనుగోలు చేసి అడ్డదారిలో మహారాష్ట్రలోని రాజూర, సింగురి, ఘట్చందూర్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి దాదాపు లక్ష క్వింటాళ్ల పత్తి తరలించినట్లు తెలుస్తున్నది.
రాష్ట్ర ఖజానాకు గండి..
మన రాష్ట్రంలో పండించిన పత్తిని ఇతర రాష్ట్రంలో అ మ్మకానికి తీసుకెళ్లాలంటే ధరపై క్వింటాలుకు 2.5 శా తం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ దళారులు రై తుల పేరిట యథేచ్ఛగా వ్యాన్లు, బొలేరోలలో తరలిస్తూ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు. ఇప్పటి వరకు రాష్ర్టానికి రూ. 2 కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తుంది. ఇంతేగాకుండా మార్కెట్ కమిటీ చెస్లోనూ నామమాత్రంగా డబ్బులు కట్టి బయలుదేరుతున్నట్లు సమాచారం. సరైన నిఘా పె ట్టకపోవడం వల్లే దళారులు సులభంగా పత్తిని మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అధికారుల దృష్టికి తీసుకెళ్లినా..
మహారాష్ట్రకు అక్రమంగా పత్తిని తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేకుం డా పోతున్నదని ఇక్కడి జిన్నింగ్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం కలెక్టర్ రాహుల్రాజ్ సంబంధిత శాఖల అధికారులు, జిన్నింగ్ మిల్లు ల యజమానులు, లారీ ఓనర్స్తో సమావేశం నిర్వహించారు. పత్తికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు అక్రమంగా పత్తిని తరలించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అయినప్పటికీ మహారాష్ట్రకు మన పత్తి రవాణా జరుగుతూనే ఉంది.
యథేచ్ఛగా రవాణా..
ఎలాంటి పత్రాలు లేకుండా మహారాష్ట్రకు పత్తి తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మం చిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి సి ర్పూర్(టీ), వాంకిడి, ఇందాని, కెరమెరి మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా లేకపోవడంతో ప్రతి రోజూ వివిధ వాహనాల్లో వేలాది క్వింటాళ్ల పత్తి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు తెలుస్తుంది. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సేల్స్ట్యాక్స్, అ గ్రికల్చర్, పోలీస్, మార్కెటింగ్ అధికారులతో జిల్లాలో 3 టీంలను ఏర్పాటు చేశారు. పత్తి అక్రమ రవాణాతో రాష్ట్ర ఆదాయానికి గండి పడడంతో పాటు ఈ ప్రాంత జిన్నింగ్ ఇండస్ట్రీలు నష్టపోవాల్సి వస్తుంది.
బిల్లులు లేకుండా రవాణా చేస్తే జరిమానా
బిల్లులు లేకుండా ఇతర ప్రాంతాలకు పత్తి రవాణా చేస్తే జరిమానా విధిస్తాం. జనవరి నుంచి వేబిల్లు, ఇన్వాయి స్ లేకుండా ఎలాంటి సరుకు రవాణా చేసినా ఊరుకోం. మూడు రెట్లు సరుకు విలువపై జరిమానా విధిస్తాం. ఇప్పటికే వ్యాపారులకు అవగాహన కల్పించాం. మహారాష్ట్ర సరిహద్దు వాంకిడితో పాటు కాగజ్నగర్,కెరమెరి,జైనూర్ తదితర ప్రాంతల్లోనూ విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాం.