రిమ్స్లోని రెండు చిల్డ్రన్స్ వార్డుల్లో 70 బెడ్స్ ఏర్పాటు
సీజనల్ వ్యాధులపై ముందస్తుగా అప్రమత్తమైన ప్రభుత్వం
కొనసాగుతున్న ఇంటింటా ర్యాపిడ్ ఫీవర్ సర్వే
శాంపిల్స్ సేకరణ.. వ్యాధి నిర్ధారణ.. మందుల పంపిణీ..
ప్లేట్లెట్స్ తగ్గితే భయపడొద్దు.. : డాక్టర్ హేమలతరెడ్డి
ఆదిలాబాద్, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వానకాలం వ్యాధులపై ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది. డెంగీ, మలేరియా, డయేరియా, టైఫాయిడ్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో.. ఏజెన్సీలోని గూడేలు, తండాలు, మారుమూల గ్రామాల్లో వైద్య బృందాలను పంపించి ర్యాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నది. అక్కడే శాంపిల్స్ సేకరించడం, వ్యాధులు నిర్ధారించడం, ఉచితంగా మందులు పంపిణీ చేయడం చేస్తున్నారు. ఇందులో భాగంగా చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కనుపాపలను కంటికిరెప్పలా కాపాడుతున్నారు. ప్రత్యేకంగా రిమ్స్లో 70 బెడ్స్ ఏర్పాటు చేసి.. నిరంతరం వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. కాగా.. వ్యాధులకు గురైతే దవాఖానకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు.
వానకాలంలో ప్రజలు వ్యాధులతో అవస్థలు పడకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ర్యాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నది. మారుమూల గ్రామాలు, ఏజెన్సీలో గూణ డేలు, తండాలు అధికంగా ఉండడంతో మలేరి యా, టైఫాయిడ్, డెంగీ, డయేరియా వంటి వ్యా ధులు వచ్చే ప్రమాదం ఉంది. దీంతో వైద్యశాఖ అధికారులు వీటి నివారణకు పక్కా ప్రణాళికలు తయారు చేసి అమలు చేస్తున్నారు. ర్యాపిడ్ ఫీవర్ సర్వేలో భాగంగా ఇంటింటా వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. వైద్య సిబ్బంది ఇం టింటా తిరుగుతూ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా జర్వం, దగ్గు, జలుబు, ఇతర ఆరోగ్య పరమైన సమస్యలు ఉన్నాయా? అని తెలుసుకుంటున్నారు. జ్వరం ఉంటే అక్కడికక్కడే మలేరియా, డెంగీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇతర సమస్యలు ఉంటే శాంపిళ్లు సేకరించి పీహెచ్సీలకు పంపి పరీక్షలు చేయిస్తున్నారు. వ్యాధిని బట్టి ఉచితంగా మం దులు పంపిణీ చేస్తున్నారు. వ్యాధి ప్రభావిత గ్రా మాల్లో వైద్యాధికారులు, సిబ్బంది వైద్యశిబిరాలు నిర్వహిస్తుండగా.. పరిశుభ్రత, వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దోమ తెరల వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు.
చిన్నారులకు చికిత్సలు..
కొన్ని రోజులుగా వైరస్ ఫీవర్స్ ప్రభావం పెరిగింది. దీంతో చిన్నారులకు మెరుగైన వైద్యం అందించడానికి వైద్యశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. రిమ్స్లో రెండు చిల్డ్రన్స్ వార్డులు ఏర్పాటు చేసి, 70 బెడ్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. మహిళల ప్రసూతీ వార్డులో 20, రెండో అంతస్తులో మరో 20 ఏర్పాటు చేయనున్నట్లు రిమ్స్ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన చిన్న పిల్లలకు రిమ్స్ చిన్న పిల్లల విభాగం వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. జ్వరాలతో బాధపడేవారికి వివిధ రకాల పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సలు చేస్తున్నారు. రెండు జిల్లాల నుంచి రోజు 15 మంది వరకు చిన్నారులు చికిత్స కోసం వస్తున్నట్లు వైద్యులు తెలిపారు. నిర్మల్ జిల్లా నుంచి అధికంగా ఉంటున్నాయన్నారు. రిమ్స్ పిల్లల వైద్యులు, సిబ్బంది 24 గంటలపాటు అందుబాటులో ఉంటూ చిన్నారులకు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. దవాఖానలో మెరుగైన వైద్యం అందుతుండడంతో చిన్నారులు జ్వరాల నుంచి కోలుకుంటున్నారు.
ప్లేట్లెట్స్ తగ్గితే భయపడవద్దు..
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో చిన్న పిల్లలకు వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. నిర్మల్ దవాఖానల నుంచి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. రక్త పరీక్షల్లో ప్లేట్లెట్స్ తగ్గినట్లు నివేదిక వస్తే భయపడవద్దు. డెంగీ జ్వరం అని ఆందోళన చెందవద్దు. వైద్యుల సూచనలు పాటించి చికిత్స తీసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలకు పొప్పడి చెట్టు ఆకు రసం తాగించవద్దు. దీంతో ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది.