ఆసిఫాబాద్, అక్టోబర్ 25 : జిల్లాలో పోడు భూముల సమస్యలపై అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ పరిష్కరించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని అటవీ, రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొద్ది మొత్తంలో పోడు భూములను సాగు చేసున్న గిరిజనులపై కొంత సానుభూతితో వ్యవహరించాలన్నారు. ఒకే వ్యక్తి 30 నుంచి 40 ఎకరాల అటవీభూమిని సాగు చేస్తే స్వాధీనం చేసుకోవాలన్నారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు గల భూముల్లో గంజాయి సాగు చేసే వారిపై పట్టాలను రద్దు చేయాలన్నారు. పీడీ యాక్టు నమోదు చేసి , రైతు బంధు, తదితర పథకాలు రాకుండా చేయాలన్నారు. జిల్లాలో గుడుంబా నివారణ కోసం శాఖ సిబ్బంది అనుమానాస్పద ప్రాంతాల్లో దాడులు నిర్వహించాలన్నారు. ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో గంజాయి సాగు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశామని, వారిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఎఫ్వో శాంతారాం,అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎక్సైజ్ అధికారి రాజ్యలక్ష్మి తదితరులున్నారు.
వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
: రానున్న యాసంగిలో రైతులు వరి పంట సాగు చేయకుండా వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రైతువేదికలో అధికారులతో సమావేశం నిర్వహించారు. వరి ధాన్యం కొనవద్దని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. యాసంగిలో వరి విత్తనాలు విక్రయించే డీలర్ల చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పంట మార్పిడిపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయాధికారులు బాధ్యతగా ప్రణాళిక ప్రకారం కంది, పెసర, మినుము తదితర చిరుధాన్యాలు పండించేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్, కేవీకే శాస్త్రవేత్త నాగరాజు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.