మామిడి రైతుల ఆశలు గల్లంతయ్యాయి. ఏ తోటకెళ్లి చూసినా.. ఒక్క మామిడి కాయ కనిపించడం లేదు. కనీసం పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దిగుబడి లేదని తెలిసి మామిడి కొనుగోలు చేయాల్సిన వ్యాపారులు తోటల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు రూ.400 కోట్ల వ్యాపారంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
మంచిర్యాల, మార్చి 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 26 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగయ్యాయి. జిల్లాలో బంగెనపల్లి, దసేరి, లంగ్డా, చెక్కర గుంటి, చెరుకు రసాల వంటివి 50 రకాలు సాగవుతున్నాయి. వీటితోపాటు పచ్చడి రకాలు కూడా పండుతాయి. వాతావరణం అనుకూలంగా ఉంటే యేటా జిల్లాలో 1.40 లక్షల మెట్రిక్ టన్నుల పంట చేతికొచ్చేది. కానీ.. ఈ ఏడాది ఐదు శాతం కాయలు కూడా తోటల్లో కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వాతావరణంలో మార్పులు మామిడి పంటలపై తీవ్రప్రభావం చూపాయి. ఆశించిన మేర వర్షాలు కురవక పోవడం, నేలలో తేమ శాతం పడిపోవడంతో సకాలంలో చెట్లు చిగురించక.. పూత రాకుండా పోయింది. దీనికితోడు తెగుళ్లు వచ్చాయి. మామిడి చెట్లు చిగురించే సమయంలో ఆకులపై లీప్ వెబ్బర్(బల్లిపాతర) వచ్చింది. చిగురించే కొనలపై బల్లిపాతర చుట్టుకోవడంతో పూతకు అడ్డుపడింది. దీంతో దాదాపు చెట్టు నిండా రావాల్సిన పూత 20 శాతం కూడా రాలేదు.
పైగా అది కూడా చాలా ఆలస్యంగా రావడంతో కొద్దిరోజులుగా మండిపోతున్న ఎండలకు నేల రాలాయి. దీంతో పూత, కాత కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. సాధారణంగా నవంబర్లో రావాల్సిన పూత జనవరి చివరి వరకు కూడా రాలేదంటున్నారు. పిందే పట్టాల్సిన పూత కూడా చివరి దశలో రాలిపోతుందంటున్నారు. పోనీ ఆలస్యంగా పూత వస్తుందనుకుంటే పొగ మంచు, చలి తీవ్రత, మబ్బులు రావడంతో ఏం చేయలేని పరిస్థితి వచ్చిందంటున్నారు. అసలు పూత, కాత రాకుండా పోయిందని బోరుమంటున్నారు.
గతేడాది పండు ఈగ ప్రభావంతో దాదాపు రూ.50 కోట్ల నుంచి రూ.70 కోట్ల పంట నేలపాలయింది. ఇప్పుడేమో లీప్ వెబ్బర్, వాతావరణ ప్రభావంతో రైతులు కోలుకోలేని దెబ్బతింటున్నారు. పూత ఆలస్యంగా రావడంతో మామిడి వ్యాపారులు ఎవరు తోటలపై ఆసక్తి చూపడంలేదు. పూత సమయంలోనే వచ్చి రైతులతో మాట్లాడుకుని అడ్వాన్సులు ఇచ్చే నాగ్పూర్ వ్యాపారులు మామిడి తోటలవైపు కన్నెత్తి చూడడం లేదు. లోకల్ వ్యాపారులు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో వచ్చే ఐదు శాతం పంటను ఎలా విక్రయించాలో తెలియక రైతులు అల్లాడిపోతున్నారు.
నేను 50 ఎకరాల మామిడి తోటలు కౌలుకు తీసుకున్న. పూత ఆలస్యంగా వస్తుందని కాయ మంచిగా కాయాలని మందులు పిచికారీ చేసిన. పూత నిలువక, కాయలు పడలేదు. అక్కడక్కడా కాసిన కాయ కూడా నిలుస్తుందో లేదోనన్న భయం ఉంది. గతేడాది 200 ఎకరాలకు పైగా తోటలను గుత్తకు తీసుకుని వ్యాపారం చేశా. పండు ఈగతో చాలా నష్టపోయా. ఈసారైనా పూత మంచిగా వస్తుందనుకుని ఆశపడ్డా. ఇప్పటి వరకు తోటలో చెట్లపై అనుకున్నంత కాత లేదు. ఎండలు ముదిరితే చెట్లపై ఒక్క పిందే కూడా ఉండదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతలేదు.
– గన్న అంజన్న, మామిడి రైతు, వ్యాపారీ.
ఈ ఏడాది మామిడి పూత అనుకున్నంతగా రాలేదు. ఇప్పటికే పిందే పట్టి వంద గ్రాముల బరువు పెరగాలి. ఎక్కడ చూద్దామన్న కాయ కనిపించడం లేదు. ఆలస్యంగా పూత వస్తే కాత నిలవదు. పంట అనుకున్నంత రాదు. తోటలను నమ్ముకుని ఉన్న రైతులకు ఈ యేడు నష్టమే వచ్చింది. ప్రతి యేదో ఒక కారణంతో నష్ట పోతున్నాం. ఐదెకరాల తోటలో కనీసం పది చెట్లు కూడా పూర్తిగా పూతకు రాలేదు. పూత వచ్చిన కాయ రావడం లేదు. ఎన్ని మందులు కొట్టినా రోగాలు పోలేదు.
చెట్టు నిండా బల్లి పాతర పట్టి పూతరాకుండా చేసింది. బల్లి పాతర పోవడానికి వేల రూపాయల మందులు కొట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. దాదాపు అరవై ఎకరాల తోటలను కౌలుకు తీసుకున్నా.. లక్షల పెట్టుబడి పెట్టినా.. లాభం లేకుండా పోయింది. ఎకరానికి కనీసం రెండు క్వింటాళ్లు కూడా పంట వచ్చే పరిస్థితి లేదు. – మెండె నర్సయ్య, మామిడి రైతు.