రాష్ట్ర పరిశీలకుడు మంజునాథ్ నాయక్
పీసీవీ కేంద్రాల తనిఖీ
మంచిర్యాల అర్బన్, ఆగస్టు 25 : జిల్లాలో ఈ నెల 18వ తేదీన ప్రారంభించిన పలు న్యూమోకొకల్ కాంజుగేట్ వ్యాక్సిన్(పీసీవీ) కేంద్రాలను రాష్ట్ర పరిశీలకుడు మంజునాథ్ నాయక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని దవాఖానతో పాటు నస్పూర్ పీపీ యూనిట్, మందమర్రి, బెల్లంపల్లి హన్మా న్ బస్తీల్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ను పరిశీలించారు. పీసీవీ కార్యక్రమం గురించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి ఫయాజ్ ఖాన్, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, ఎన్హెచ్ఎం డీపీవో రవీందర్, డాక్టర్ ఇంద్రావతి, డాక్టర్ శైలజ, డాక్టర్ ఝాన్సీ తదితరులున్నారు.
ప్రభుత్వ దవాఖాన సందర్శించిన రాష్ట్ర పరిశీలకులు
మందమర్రి ఆగస్టు 25: మందమర్రి పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక కేంద్రాన్ని బుధవారం పీసీవీ టీకా(న్యూమోనియా) రాష్ట్ర పరిశీలకుడు మంజునాథ్ నాయక్, ఎన్హెచ్ఎం డీపీవో రవీందర్ సందర్శించారు. న్యూమోనియా టీకాపై ప్రజల స్పందనను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ఊరు మందమర్రి గ్రామంలో ఏర్పాటు చేసిన న్యూమోనియా టీకా కేంద్రాన్ని ఆయన సందర్శించి టీకా వేసే విధానాన్ని పరిశీలించారు. అంతకు ముందు దవాఖానలో రికార్డులను పరిశీలించారు. న్యూమోనియా టీకా మూలంగా చేకూరే ప్రయోజనాలను వివరించి ప్రజలను చైతన్య పరచాలని సిబ్బందికి సూచించారు. దీని మూలంగా చిన్న పిల్లల్లో న్యూమోనియా రాకుండా నివారించవచ్చన్నారు. టీకాతో ఎలాంటి దుష్పలితాలు ఉండవని, ఎలాంటి అనుమానాలకు లోను కారాదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇమ్యునైజేషన్ జిల్లా అధికారి డాక్టర్ ఫాయిస్, మండల వైద్యాధికారి శైలజ, జిల్లా ఆరోగ్య బోధకులు అల్లాడి శ్రీనివాస్, ఏఎన్ఎంలు పద్మావతి, రాజేశ్వరి, ఆశ వర్కర్లున్నారు.
వ్యాక్సినేషన్ను విజయవంతంగా నిర్వహించాలి
సీసీసీ నస్పూర్, ఆగస్టు 25: న్యూమోకోకల్ వ్యాక్సిన్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర వ్యాక్సినేషన్ పర్యవేక్షకుడు మంజునాథ నాయక్ సూచించారు. నస్పూర్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పీహెచ్సీని సందర్శించి వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియపై ఆరాతీశారు. చిన్న పిల్లలకు పంపిణీ చేసే న్యూమోకోకల్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రణాళిక ప్రకారం విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటి వరకు నస్పూర్ పీహెచ్సీలో పంపిణీ చేసిన వ్యాక్సిన్ వివరాలను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్చనను అడిగితెలుసుకున్నారు. వారంలో రెండు రోజుల పాటు వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నట్లు డాక్టర్ అర్చన తెలిపారు. ఒకటిన్నర సంవత్సరాల పిల్లలతో పాటు మూడున్నర, 9సంవత్సరాల పిల్లలకు మూడు డోసుల వ్యాక్సిన్ వేస్తున్నట్లు చెప్పారు. బెల్లంపల్లి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రవీందర్, నస్పూర్ పీహెచ్సీ వైద్యుడు వంశీ, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలున్నారు.
రెబ్బెన మండలంలో..
రెబ్బెన, ఆగస్టు 25: మండలకేంద్రంలోని రెబ్బెన పీహెచ్సీ, గోలేటి ఉప కేంద్రంలో పీసీపీ వ్యాక్సినేషన్ను వైద్యారోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మంజునాథ్, రాష్ట్ర పరిశీలకుడు రవీందర్ బుధవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో సుధాకర్నాయక్, డీఐవో సునీల్రావు, పీహెచ్సీ డాక్టర్ భరత్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వెంకటేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.