గుడిహత్నూర్,ఆగస్టు 28 : ఆధునిక పద్ధతు లు పాటిస్తూ.. సంప్రదాయ పంటల స్థానంలో కూరగాయలు, పప్పు దినుసుల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. శాశ్వత పందిళ్లు, బిందు సేద్యం, మల్చింగ్, స్ప్రింక్లర్ల ప్రాముఖ్యతపై ఉ ద్యానశాఖ అవగాహన కల్పించడంతో రైతులు ఆ పద్ధతిలో పంటలు పండిస్తూ అధిక దిగుబడులు పొందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 25 ఎకరాల్లో రైతులు పందిరి సాగు ద్వారా కూరగాయ లు పండిస్తున్నారు. దీని వల్ల అధిక వర్షాలు కురిసినా కాయలు కుళ్లిపోకుండా, నాణ్యతగా ఉంటాయి. సగం దిగుబడి అధికంగా వస్తుండడంతోపాటు మార్కెట్లో ధర పలకడంతో పందిరి సాగు వైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. గుడిహత్నూర్ మండలంలోని తోషం గ్రామానికి చెందిన రైతు పస్తాపురే రవీందర్, తన చేనులో రెండు ఎకరాల్లో పందిరి సాగు ద్వారా వివిధ రకాల కూరగాయలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఉద్యానవన శాఖ అధికారుల సూచనలు, సలహాలు, ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడంతో 2008 నుంచి సోరకాయ, బీరకాయ, కాకర, చిక్కుడు పండిస్తున్నాడు. సోరకాయ పంట ఏడాదిలో రెండుసార్లు దిగుబడి వస్తుంది. ఎకరానికి రూ.6 వేల ఖర్చు కాగా, సుమారు 40 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. మార్కెట్లో ధర కిలోకు రూ.15 నుంచి 25 వరకు పలుకుతున్నది. దీంతో ఆదాయం ఆరు నెలల్లో రూ.50 వేలు వస్తుంది. దీంతోపాటు బీర, చిక్కుడు ఈ రెండు పంటలకు ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి ఖర్చు కాగా, రూ.లక్షన్నర వరకు ఆదాయం వస్తుంది. మొత్తానికి పందిరి సాగు ద్వారా ఎకరా కూరగాయల సాగుతో ఏడాదికి రూ.రెండున్నర లక్షల ఆదాయం వస్తుందని రైతు తెలిపాడు.
పందిరి సాగు లాభదాయకం..
కూరగాయలను నేల సాగు కంటే పందిరి సాగులో పండిస్తే లాభదాయకంగా ఉంటుంది. వర్షాలు ఎక్కువగా కురిసినా కాయలు చెడిపోకుండా నాణ్యతగా ఉంటాయి. నా రెండెకరాల్లో కూరగాయలు సాగుచేస్తున్న. దాదాపు ఈ సాగుతో ఎకరానికి రెండు లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుంది.
– పస్తాపురే రవీందర్, రైతు, తోషం
రైతుల ఆసక్తి..
పందిరి సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 42 పందిరి యునిట్లు మంజూరయ్యాయి. వాటిలో కొన్ని పూర్తి కాగా, మరికొన్ని ప్రోగ్రేస్లో ఉన్నాయి. ఆధునిక పద్ధతిలో కూరగాయల సాగుపై రైతులకు సూచనలు, సలహాలు, అవగహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
– శ్రీనివాస్రెడ్డి ఉద్యానవన శాఖ అధికారి