అన్నీ సక్రమంగానే ఉన్నాయి
ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు నవీన్ మిట్టల్
ఎదులాపురం, నవంబర్ 24 : ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి స్థానానికి దాఖలైన నామినేషన్లలో అన్నీ సక్రమంగానే ఉన్నాయని, ఏ ఒక్కటీ తిరస్కరించలేదని ఎన్నికల పరిశీలకుడు నవీన్ మిట్టల్ తెలిపారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికకు 24 మంది అభ్యర్థులు 30 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. వాటిని ఎన్నికల నిబంధనల మేరకు పరిశీలించినట్లు పేర్కొన్నారు. నామినేషన్లన్నీ సక్రమంగానే ఉన్నాయని, ఏ ఒక్కటీ తిరస్కరించబడలేదని తెలిపారు. పరిశీలన సందర్భంగా 15 మంది అభ్యర్థులు, వారి ప్రతిపాదికులు హాజరయ్యారని పేర్కొన్నారు. సహాయ ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ ఎస్.నటరాజ్, ఎలక్షన్ సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు స్థానిక అటవీశాఖ విశ్రాంతి భవనంలో ఎన్నికల పరిశీలకుడు నవీన్ మిట్టల్కు కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర పూలమొక్కలతో స్వాగతం పలికారు. ఆయన వెంట ఆర్టీవో రాజేశ్వర్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎస్.భీమ్ కుమార్ ఉన్నారు.
ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నియమావళి అమల్లో ఉందని, ఎవరూ ఉల్లంఘనలకు పాల్పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు నవీన్ మిట్టల్ అన్నారు. జిల్లాకు చేరుకున్న ఆయన.. అటవీశాఖ విశ్రాంతి భవనంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఎన్నికల పరిశీలకుడిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు కాసేపు ఎన్నికల అంశాలపై చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నియమావళి అమల్లో ఉందని తెలిపారు. ఎవరూ ఉల్లంఘనలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో శాంతి భద్రతలు కలిగి ఉన్నాయని ఎన్నికల సందర్భంగా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నట్లు ఇన్చార్జి ఎస్పీ వివరించారు.