పెద్ద సంఖ్యలో ప్రవేశాలు
ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక
తలమడుగు, నవంబర్ 24: ఏటా సర్కారు పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయుల నానాపాట్లు పడేవారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. కరోనా సమయంలో సర్కారు పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగాయి. అదే సమయంలో ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక సంఖ్య కూడా తగ్గింది. కరోనా వైరస్ భయం వీడి, స్కూల్ ఫీజులు చెల్లించలేని స్థితిలో విద్యార్థులు ఉండడంతో ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతుండగా ప్రభుత్వ స్కూళ్లలో పెరుగుతున్నది. విద్యార్థులతో బడులు కళకళలాడుతున్నాయి. ఉపాధ్యాయులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠాలు బోధిస్తున్నారు. సర్కారు సూళ్లలో విద్యార్థులకు ప్రభుత్వం నోట్ పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తుండడంతో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై ఆసక్తి చూపుతున్నారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుతున్నారు. గతంలో ప్రైవేట్ అయితే ఎక్కువ శ్రద్ధ చూపేవారు. ఇప్పుడు నాణ్యమైన విద్యతో పాటు ఇంగ్లిష్, తెలుగు మీడియాలు ఉండడంతో పిల్లలు ప్రభుత్వ స్కూళ్లపై ఆసక్తి చూపుతున్నారు. తలమడుగులో మండలంలో 23 ప్రాథమిక పాఠశాలలు, 9 ఉన్నత పాఠశాలలు, 3 ప్రాథమికోన్నత పాఠశాలలు, 17 టీడబ్ల్యూపీఎస్లు, 2 గిరిజన ఆశ్రమ వసతి గృహాలు, ఒక కస్తూర్బా విద్యాలయం ఉన్నాయి. కరోనా వ్యాప్తికి ముందు పాఠశాలల్లో 4290 మంది విద్యార్థులు ఉండేవారు. ప్రస్తుతం పాఠశాలల్లో 4640 మంది చదువుకుంటున్నారు. 350 మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. మండల అధికారులు పాఠశాలలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
పెరిగిన హాజరుశాతం
ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులను తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. తరగతుల వారీగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నాం. ప్రతి రోజూ పాఠశాలలను పర్యవేక్షిస్తున్నాం. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. బోధనపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు కృషి చేశారు.
-నారాయణ, ఎంఈవో, తలమడుగు