ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 24: రాష్ట్రస్థాయి కళోత్సవ్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. రెండో రోజు ఆన్లైన్లో జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం నుంచి డీఈవో ప్రణీత ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఫోక్డ్యాన్స్ విభాగంలో గిమ్మ జడ్పీహెచ్ఎస్కు చెందిన రిత్విక్, జానపద నృత్యంలో లిటిల్స్టార్ హైస్కూల్కు చెందిన గౌలి శ్రావణ్, మన్నూర్ జడ్పీహెచ్ఎస్కు చెందిన త్రిశ్లు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రదర్శనలు ఇచ్చారు. వారికి ప్రశంసా పత్రాలు, బహుమతులను డీఈవో అందజేసి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారులు కంటె నర్సయ్య, నారాయణ, న్యాయనిర్ణేతలు సతీశ్ దేశ్పాండే, కబీర్దాస్, విద్యాసాగర్ రెడ్డి, కవిత పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, నవంబర్ 24 : జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో కళోత్సవ్ 2021 రాష్ట్ర స్థాయి పోటీలు రెండో రోజు ఆన్లైన్లో కొనసాగాయి. బుధవారం జానపద గీతాలు, నృత్య పోటీలు నిర్వహించారు. జానపద పోటీల్లో నిర్మల్కు చెందిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి సాయికృష్ణ, లోకేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన రాజేందర్, నృత్యాల పోటీల్లో దిలావర్పూర్ కేజీబీవీకి చెందిన అంజలి, గౌతం మాడల్ స్కూల్కు చెందిన ఆకాశ్ పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను డీఈవో రవీందర్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి వినోద్ కుమార్, జిల్లా ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషన్ సిద్ద పద్మ, సెక్టోరియల్ అధికారి సలోమి కరుణ అభినందించారు.