మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య
నిర్మల్ జిల్లా అధికారులతో సమావేశం
నిర్మల్ టౌన్, నవంబర్ 24 : ప్రజలు ఏ ప్రదేశానికెళ్లినా ఆ సమయంలో నిర్భయంగా, స్వేచ్ఛగా వెళ్లగలిగే వాతావరణం కల్పించినప్పుడే మానవ హక్కులు అమలవుతాయని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అభిప్రాయపడ్డారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధ్యక్షతన బుధవారం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితం మన హక్కు అని, ఒకరి హక్కులకు భంగం కలిగించే అధికారం ఎవరికీ లేదని తెలిపారు. హక్కులకు భంగం కలిగినప్పుడు కమిషన్ను ఆశ్రయించవచ్చన్నారు. జీవించే హక్కు, స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం ప్రాథమిక హక్కులని, ఇవి దేశంలో అమలు కావడం లేదన్నారు. 1983లో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేసిందని తెలిపారు. మానవ హక్కుల గురించి విస్తృతమైన అవగాహన కల్పించాలని, ఇందుకు సామాజిక, పత్రిక రంగాల ద్వారా ప్రజలకు చేరువ చేయాలని పేర్కొన్నారు. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే ఎంతటి వారైనా శిక్షకు అర్హులన్నారు. గతంలో పాఠశాలల్లో మైదానాలు ఉండేవని, ఆటలతో మానసిక వికాసం పెంపొందుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజలకు అవసరమైన అన్ని సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఊరిలో శిబిరాలు నిర్వహించి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నామని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, సీ రాంబాబు, ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్కుమార్, డీఎఫ్వో వికాస్మీనా, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం చైర్మన్కు కలెక్టర్ అధికారులు పూలబొకేను అందించి జ్ఞాపిక అందించారు. అంతకుముందు స్థానిక విశ్రాంతి భవనంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. స్థానిక అటవీశాఖ అతిథిగృహంలో బుధవారం ఉదయం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జి.చంద్రయ్యను నిర్మల్ జిల్లా పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్టు సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్, కమిటీ సభ్యులు ప్రభాకర్, రాథోడ్ రొహిదాస్ పాల్గొన్నారు.
సాయి ఆలయంలో పూజలు
నిర్మల్ అర్బన్, నవంబర్ 24 : నిర్మల్ జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్యకు మంగళవారం రాత్రి అధికారులు ఘన స్వాగతం పలికారు. బుధవారం ఉదయం పట్టణంలోని గండిరామన్న దత్తసాయి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. చంద్రయ్యకు వేదపండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ట్రస్టీ చైర్మన్ లక్కాడి జగన్మోహన్ రెడ్డి సన్మానించారు. ఆలయ చరిత్రను వివరించారు. నిర్మల్ ఆర్డీవో రమేశ్ రాథోడ్, ఆయా మండలాల తహసీల్దార్లు ఉన్నారు.
సబ్జైలులో మొక్కలు నాటిన జస్టిస్ చంద్రయ్య
పట్టణంలోని సబ్జైల్ను జస్టిస్ చంద్రయ్య సందర్శించారు. ఖైదీలతో మాట్లాడారు. ఖైదీల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలపై జైలు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మొక్క నాటారు. ఆయన వెంట ఆర్డీవో రమేశ్, జైలు శాఖ అధికారులున్నారు.