మర్మోగిన జైనథ్ వీధులు
వేలసంఖ్యలో హాజరైన భక్తులు
కనుల పండువగా శ్రీలక్ష్మీనారాయణస్వామి రథోత్సవం
సామూహిక వ్రతంలో పాల్గొన్న ఎమ్మెల్యే జోగురామన్న దంపతులు
జైనథ్, నవంబర్ 24 : జైనథ్ శ్రీలక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కార్తీక బహుళ పంచమి సందర్భంగా బుధవారం నిర్వహించిన రథోత్సవం కనులపండువగా సాగింది. జైశ్రీమన్నారాయణ నామస్మరణతో జైనథ్ పరిసరాలు మార్మోగాయి. రథోత్సవాన్ని వీక్షించేందుకు జి ల్లాతోపాటు పక్కనున్న మహారాష్ట్రనుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో భక్తులతో జైనథ్ కిటకిటలాడింది.
అశేష జనవాహిని మధ్య..
స్వామివారి రథోత్సవానికి అశేష జనవాహిని హాజరైంది. అంతకుముందు హోమం, బలిహరణం నిర్వహించారు. జైశ్రీమన్నారాయణ అంటూ వేదపండితుడు శ్రీధీరజ్ కుమార్ ఆధ్వర్యంలో రథాన్ని ముందుకు కదిపారు. దాడిపొడవునా మహిళలు మంగళహారతులతో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులు పేలాలు, పుట్నాలు చల్లుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు. అశేష జనవాహిని మధ్య నడుమ రథంపై శ్రీలక్ష్మీనారాయణ స్వామి, గరుత్మంతుడు, అశ్వములు, శేషవాహా మూర్తులను ఊరేగించారు. రథం ముందు భజన సంకీర్తనలు, కోలాటాలతో శోభాయాత్ర నిర్వహించారు. జైనథ్ వాసులు అతిపురాతనమైన బల్లెములకు బంతిపూలతో అలంకరించి రథం ముందర సైనికులుగా ముందుకు సాగారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సామూహిక సత్యనారాయణ వ్రతంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న దంపతులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన రథోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ.. ఈ ఆలయం ఎంతో విశిష్టత గలదన్నారు. జైనుల కాలంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయని పేర్కొన్నారు. డీడీసీ రాష్ట్ర చైర్మ న్ లోక భూమారెడ్డి, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, జడ్పీటీసీలు తుమ్మల అరుంధతి, తాటిపెల్లి రాజు, కుమ్ర సుధాకర్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఎస్.లింగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు బాలూరి గోవర్ధన్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ పూండ్రు వెంకటరెడ్డి, సర్పంచ్ దేవన్న, నాయకుడు గణేశ్యాదవ్ పాల్గొన్నారు.