‘నమస్తే’ కథనానికి సీఎస్సీ స్పందన
రిమ్స్లో వివరాలు తీసుకొని అకౌంట్ తెరిచిన అధికారులు
ఆదిలాబాద్ టౌన్, నవంబర్ 23 : భర్త వేధింపులకు తోడు పక్షవాతంతో బాధపడుతూ కష్టాలు అనుభవిస్తున్న ఆర్తికి బ్యాంక్ అధికారులు సైతం అండగా నిలిచారు. రిమ్స్లో చికిత్స పొందుతున్న ఆమె వద్దకు వెళ్లి వివరాలు తీసుకొని బ్యాంక్ ఖాతా అందించారు. ముగ్గురు చిన్నారులతో చీకటిలో ఆకలితో అలమటిస్తున్న ఆర్తి వైనాన్ని ‘నమస్తే తెలంగాణ’ ఈ ఆదివారం ‘ఆమె ఆర్తి తీర్చేదెవరు’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనికి తక్షణం స్పందించిన డీసీపీవో నెలకు సరిపడా సరకులు ఇవ్వడమే కాకుండా మూడు నెలల రేషన్, పిల్లలకు నెలకు రూ.2 వేల చొప్పున భత్యం మంజూరు చేసేలా ప్రక్రియ పూర్తి చేశారు. కాగా.. ఆదిలాబాద్ రిమ్స్ వారు సోమవారం ఆర్తి అద్దెకుంటున్న ఇంటికే అంబులెన్స్ పంపి చికిత్స అందజేస్తున్నారు. ఈ క్రమంలో వివిధ శాఖలు, మానవతావాదులు స్పందించారు. పేదరికంలో, ఏ తోడూ లేని ఆర్తికి కనీసం బ్యాంకు ఖాతా కూడా లేని వైనాన్ని ‘నమస్తే’ ప్రస్తావించింది. పక్షవాతం కారణంగా బ్యాంకుకు కూడా వెళ్లలేని దుస్థితి. ఖాతాలేక ప్రభుత్వ పరంగా చేయూత అందించాలంటే ఇబ్బందే అయింది. ఈ పరిస్థితిపై సీఎస్సీ వారు స్పందించారు. ఆదిలాబాద్ సీఎస్సీ ( కామన్ సర్వీసెస్ సెంటర్) మేనేజర్ కామెరి రాహుల్, ఎస్బీఐ బీసీ పాయింట్ నిర్వాహకులు పవార్ అంబాజీ, విక్కీ మంగళవారం రిమ్స్కు వచ్చారు. ఆర్తి బెడ్ వద్దకే వెళ్లి అక్కడే బ్యాంకు ఖాతా తెరిచారు. ఎస్బీఐ ఖాతా నంబర్ 40596021137, ఐఎఫ్ఎస్సీ కోడ్ నంబర్ SBIN0011987 కేటాయించారు. దాతలెవరైనా ఈ అకౌంట్ నంబర్కు డబ్బులు వేసి ఆర్తికి సహాయం చేయవచ్చు. ఇదిలాఉంటే ప్రత్యేక పరిస్థితుల్లో ఆర్తి చెంతకే వెళ్లి ఇలా బ్యాంకు ఖాతా తెరవడంపై రిమ్స్ వైద్యులు, స్థానికులు సీఎస్సీ వారిని అభినందించారు. సాధారణంగా ఆయా ప్రభుత్వ పథకాల లబ్ధికి సంబంధించి సీఎస్సీలు ఇంటికే వెళ్లి చెల్లింపులు చేయడం చూశాం గానీ.. ఇలా చెంతకే వచ్చి ఖాతా తెరవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.