దహెగాం, డిసెంబర్22 : వరి పంటను కొనకుండా రైతుల అభివృద్ధికి నిరోధకంగా కేంద్ర ప్రభుత్వం మారుతున్నదని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. బుధవారం ఎంపీపీ కంబగౌని సులోచన ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. వైద్యంపై చర్చ నిర్వహించగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలతో పాటు మండలంలో వ్యాక్సినేషన్పై చర్చించారు. ఈ నెల చివరాఖరుకు మిగిలిన వారికి టీకా ఇవ్వనున్నట్లు వైద్యాధికారి చంద్రకిరణ్ తెలిపారు. అదే విధంగా మారుమూల గ్రామాలైన మొట్లగూడ రాంపూర్, రావులపల్లి దిగడ గ్రామాల్లో 99 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడంపై ఎమ్మెల్యేతో పాటు సభ్యులు అభినందించారు. విద్యా, పశువైద్యం, ఈజీఎస్, ఐసీడీఎస్, విద్యుత్, వ్యవసాయం తదితర శాఖలపై చర్చ నిర్వహించారు. ఈ సందర్బంగా జడ్పీటీసీ తాళ్లపల్లి శ్రీరామరావు మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన మంచిర్యాల జిల్లాలో ఉన్న చిన్నగుడిపేట్, తిమ్మాపూర్, సాలిగాం, మాడవెల్లి పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్యేను కోరారు. అదేవిధంగా చిన్నగుడిపేట్ నుంచి వడాల వరకు రోడ్డు నిర్మాణంతో పాటు దహెగాం మండలంలోని ఖర్జీ రోడ్డు దుబ్బగూడ వద్ద ఒర్రెపై వంతెన నిర్మించాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే సాను కూలంగా స్పందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో పలు గ్రామాలకు నెలకొన్న విద్యుత్ సమస్యను ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానన్నారు. మెట్లగూడ వరకు బీటీ రోడ్డు సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. పాత అగ్గాం వద్ద పెద్దవాగుపై వంతెన నిర్మాణం నెల రోజుల్లో పూర్తికానుందని పేర్కొన్నారు. పెంచికల్పేట్ నుంచి దహెగాం వరకు డబుల్ రోడ్డు మంజూరుతో పాటు నిధులు కేటాయించామని చెప్పారు. పెంచికట్పేట్నుంచి చైక నుంచి కల్వాడ వరకు రోడ్డునిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో మండలంలో 80 శాతం రోడ్ల నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు మండలంలో ప్రతి సంవత్సరం రూ.33 కోట్లు రైతులకు అందుతున్నాయని, 25 మంది రైతులు చనిపోతే వారికి రైతు బీమా డబ్బులు అందినట్లు తెలిపారు. వ్యవసాయ భూములకు వెళ్లేందుకు రోడ్లకోసం ప్రతిపాదనలు తయారు చేయాలని ఎంపీపీ సులోచన, జడ్పీటీసీ శ్రీరామరావుకు సూచించారు.