రైతు బంధు సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు భోజారెడ్డి
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 22 : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది కేంద్ర ప్రభుత్వం కాదా…? అని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి స్థానిక బీజేపీ నాయకులను ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరలను రూ.100 దాటించిన ఘనత బీజేపీది కాదా..? అని అన్నారు. పెంచిన దొంగలే తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ఆందోళనలు చేపట్టడం సిగ్గుచేటన్నారు. ప్రజలు అందరినీ గమనిస్తున్నారని, వారే బీజేపీకి తగిన బుద్దిచెబుతారని పేర్కొన్నారు. సుమారు 15 నెలలు ఆందోళనలు చేస్తే, కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దుచేస్తున్నామని ప్రకటించిందని, ఇది రైతుల విజయమేనని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లా రాజేశ్వర్, నారాయణ, మహేశ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.