భారతీయులందరూ నా కుటుంబమే
అఫ్గాన్ నుంచి 62 మందిని సురక్షితంగా తీసుకొచ్చినందుకు ఆనందంగా ఉంది
యువత దేశ సేవకు సిద్ధంగా ఉండాలి
‘నమస్తే’ తో సీనియర్ కమాండర్ సురేశ్
లక్షెట్టిపేట రూరల్, ఆగస్టు 22 : కుటుంబంకంటే దేశ సేవే గొప్పదని, 130 కోట్ల భారతీయులంతా నా కుటుంబంతో సమానమేనని, వారి సేవలో ఉన్నందుకు గర్వంగా ఉందని ఐటీబీపీ సీనియర్ కమాండర్ ఎంబడి సురేశ్ పేర్కొన్నారు. తాలిబన్ వశమైన అఫ్గాన్ నుంచి 62 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చిన ఆయన, ఐదురోజులుగా ఢిల్లీలోని క్వారంటైన్లో ఉన్నారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ’ ఆయనను ఫోన్లో పలకరించగా ఆసక్తికర వివరాలు వెల్లడించారు.
నమస్తే : మీ కుటుంబ నేపథ్యం, బాల్యం, విద్యాభ్యాసం చెప్పండి..?
కమాండర్ సురేశ్ : మాది లక్షెట్టిపేటలోని గోదావరి రోడ్డు. మా తల్లిదండ్రులు మల్లమ్మ-సాయన్న. నేనొక్కడినే కొడుకును, ముగ్గురు అక్కాచెల్లెళ్లు. మాది మధ్య తరగతి కుటుంబం. నేను స్థానిక శ్రీ సరస్వతీ శిశుమందిర్లో ఏడో తరగతి వరకు, ప్రభుత్వ హైస్కూల్లో పదో తరగతి, స్థానిక జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాను. శిశుమందిర్లో చదువుతున్నప్పుడే దేశభక్తిపై అమితమైన ప్రేమ, ఆసక్తి ఉండేది.
అఫ్గానిస్తాన్లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి?
కమాండర్ సురేశ్ : అమెరికా, నాటో దళాల ఉపసంహరణ అనంతరం అఫ్గాన్లో శాంతిభద్రతలు సమస్యలు ప్రమాదకరంగా మారాయి. తాలిబాన్లు తమ ఆధిక్యతను ప్రదర్శించడంతో అక్కడి ప్రజలు, ఇతర దేశాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు అఫ్గాన్లోని మన దేశస్తులను ఇప్పటికే సురక్షితంగా ఢిల్లీకి చేర్చాం.
అఫ్గాన్లో పనిచేసే అవకాశం ఎలా వచ్చింది?
కమాండర్ సురేశ్ : ఐటీబీపీలో పని చేస్తున్న క్రమంలో మా టీమ్కు డెహ్రడూన్లో కఠిన శిక్షణ తర్వాత భారత ప్రభుత్వం ప్రత్యేక విధుల్లో భాగంగా అఫ్గాన్లోని రాయబార కార్యాలయ ఉద్యోగులు, సిబ్బందిని సురక్షితంగా దేశానికి చేరవేయాలని ఆదేశించింది. నేను డిఫ్యూటేషన్పై అఫ్గానిస్తాన్లోని కాబూల్లో మన దేశం తరఫున విధులు నిర్వహిస్తున్నా. కొంతకాలం తర్వాత చైనా బోర్డర్లోని సియాచిన్ ప్రాంతంలో విధులకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
మీరు వేరే దేశంలో ఉన్నప్పుడు మీ కుటుంబం గుర్తుకు వస్తే ఎలా ఉండేది?
కమాండర్ సురేశ్ : దేశ సేవలో భాగంగా భారత ప్రభుత్వం ఎక్కడా విధులు కేటాయించిన తప్పకుండా వెళ్లాల్సిందే. పరాయి దేశంలో విధులు నిర్వహించే క్రమంలో నా కు టుంబం గుర్తుకు వస్తే కుటుంబంకంటే దేశ సేవే గొప్పదని, 130 కోట్ల భారతీయులంతా నా కుటుంబంతో సమానమేనని, వారి సేవలో ఉన్నందుకు గర్వంగా భావించేవాడిని.
దేశ సేవకోసం మిమ్ముల్ని ఎవరు ప్రేరేపించారు?
కమాండర్ సురేశ్ : శిశుమందిర్లో చదువుకునే క్రమంలో మాకు ఏక పాత్రాభినయ నాటక పోటీలు నిర్వహించేవారు. నేను అందులో సైనికుడి పాత్ర వేసేవాణ్ణి. అప్పటి నుంచి దేశ భక్తి, సేవలపై అమితమైన ఆసక్తి కలిగింది. దీంతో నేను భరతమాత సేవకై సరిహద్దుల్లో పని చే యాలని నిర్ణయించుకున్నా. నా చిన్ననాటి కల నెరవేరింది.
యువతకు మీరిచ్చే సందేశం ఏమిటి?
కమాండర్ సురేశ్ : ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా మన దేశంలో యువత ఉన్నారు. యువత చదువును కేవలం ఉద్యోగాల కోసమే అని చూడకుం డా స్వ యం ఉపాధి, నైపుణ్య శిక్షణను పెం పొందించుకొని జీవితంలో రాణించాలి.
ముఖ్యంగా సరిహద్దు విధుల్లో పెద్ద ఎత్తున పాలుపంచుకోవా లి. రాష్ట్ర స్థాయి లో కాకుండా జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రతిభ చూపి ఉ ద్యోగాలు పొందాలని నా అభిప్రాయం.