మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్, జూన్ 30(నమస్తే తెలంగాణ) : ఆదివాసుల జిల్లా ఆసిఫాబాద్పై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వరాల జల్లు కురిపించారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీసు ఆఫీసు, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. కొట్నాక భీం రావు, కుమ్రం భీం విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని అశేషజన వాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. గిరిజనుల జయజయ ధ్వానాల మధ్య వరాలు కురిపించారు. వార్ధా నదిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.75 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కో మున్సిపాలిటీకి రూ.25 కోట్ల చొప్పున ఆసిఫాబాద్ జిల్లాలోని రెండు మున్సిపాలిటీలకు రూ.50 కోట్లు.. మంచిర్యాల జిల్లాలోని ఏడు బల్దియాలకు రూ.175 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. రెండు జిల్లాల్లోని జీపీలకు రూ.64.60 కోట్లు ఇస్తామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లోని బావులకు ఎస్టీ నిధుల నుంచి త్వరలో త్రీఫేజ్ కరెంటు సరఫరా చేస్తామని, కాగజ్నగర్కు ఐటీఐ కళాశాల, నాగమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు శుక్రవారం వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాపై వరాల జల్లు కురిపించారు. కౌటాల మండలంలోని గుండాయిపేట, నందివర్దన్ల మధ్యలో వార్ధా నదిపై రూ.75 కోట్లతో హై లేవల్ బ్రిడ్జి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన జీవో కాపీని కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు ప్రగతి నివేదన సభా వేదికపై అందజేశారు. వార్ధ్దా బరాజ్ నిర్మాణం వల్ల ఆసిఫాబాద్, కాగజ్నగర్ నియోవర్గాల్లోని 70 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. పారిశ్రామిక ప్రాంతమైన కాగజ్నగర్లో యువకులకు ఉపాధి కల్పించడానికి ఐటీఐ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సిర్పూర్(టీ)లో నాగమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలకు ఒక్కోదానికి రూ.25 కోట్ల చొప్పున రూ.50 కోట్లు, జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలకు ప్రతి జీపీకి రూ.10 లక్షల చొప్పున రూ.33.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు ప్రతి బల్దియాకు రూ.25 కోట్ల చొప్పున రూ. 175 కోట్లు, జిల్లాలోని 311 పంచాయతీలకు ప్రతి జీపీకి రూ.10 లక్షల చొప్పున రూ.31.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లోని బావులకు ఎస్టీ నిధుల నుంచి త్వరలో త్రీఫేజ్ కరెంటు సరఫరా చేస్తామన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడంతోపాటు ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు జరుగుతాయమని స్పష్టం చేశారు. గతంలో ప్రజలు బెజ్జూరు నుంచి ఆదిలాబాద్కు వెళ్లేవారని, ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లాలో కలెక్టరేట్, పోలీసు కార్యాలయాలను ప్రారంభించుకోవడం సంతోషకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. జిల్లాకు పక్కనే ఉన్న మహారాష్ట్ర వాసులు తమకు తెలంగాణ పథకాలు వర్తింప చేయాలని కోరుతున్నారని, తమ గ్రామాలను తెలంగాణలో కలుపాలని అడుగుతున్నట్లు పేర్కొన్నారు.
సీఎం సభకు కట్టుదిట్టమైన భద్రత
ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, జూన్ 30 : సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ సురేశ్ కుమార్ ఆధ్వర్యంలో ముగ్గురు ఎస్పీల పర్యవేక్షణలో 2,100 మంది పోలీసులు, 10 అదనపు అదనపు ఎస్పీలు, 10 మంది డీఎస్పీలు, 35 మంది సీఐలు, 150 మంది ఎస్సైలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇతర జిల్లాల నుంచి మూడు రోజుల క్రితమే జిల్లా కేంద్రానికి చేరుకున్న ప్రత్యేక పోలీసు బృందాలు.. సభకు వచ్చిన ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. సీఎం హెలీప్యాడ్ నుంచి కుమ్రం భీం చౌరస్తా, బీఆర్ఎస్ భవన్, డీపీవో కార్యాలయం, నూతన కలెక్టరేట్, సీఎం సభ వరకు ప్రత్యేక బృందాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 24 గంటల ముందు కీలకమైన టెస్టు పూర్తి చేసి, ప్రాంగణాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. సీఎం సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా మూడు రూట్లలో ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేయడంతో వాహనాలు నిలిపేందుకు ఇబ్బందులు కలుగలేదు. వాంకిడి, కెరమెరి, జైనూర్, లింగాపూర్, సిర్పూర్(యు) మండలాలకు చెందిన ప్రజలకు జన్కాపూర్ వద్ద గల టాటియా గార్డెన్ భోజన సదుపాయం కల్పించడంతో పాటు పార్కింగ్ ఏర్పాటు చేశారు. సిర్పూర్ నియోజకవర్గంలోని ఆయా మండలాల ప్రజలకు, రెబ్బెన మండలం నుంచి వచ్చే ప్రజలకు వాసవి గార్డెన్, ఛత్రపతి శివాజీ భవనం వద్ద భోజన సదుపాయంతో పాటు పార్కింగ్ సదుపాయం కల్పించారు. తిర్యాణి మండలంతో పాటు చిర్రకుంట నుంచి వచ్చే ప్రజలకు బాబాపూర్ క్రాస్రోడ్ సమీపంలో ఏర్పాట్లు చేశారు. ప్రేమల గార్డెన్ రోడ్లు, ఎస్పీ నూతన కార్యాలయం రోడ్లను భద్రతా ఏర్పాట్లలో భాగంగా మూసివేశారు.
వెల్కం కేసీఆర్..
పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టేందుకు శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతులు, కూలీలు ఘన స్వాగతం పలికారు. చింతలమానేపల్లి మండలం బాబాపూర్ శివారులో రైతులు, కూలీలు వెల్కాం.. థ్యాంక్యూ కేసీఆర్ ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, తమకు జరిగిన మేలును తెలుపుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
సీఎం సారు చేతుల మీదుగా పట్టా అందుకున్న..; ఆత్రం కట్టి, పాట్నాపూర్, ఆసిఫాబాద్ జిల్లా
నమస్తే : సమైక్య పాలనలో భూమి ఎలా సాగు చేశారు? ఇబ్బందులు పడ్డ సంఘటనలున్నాయా?
ఆత్రం కట్టి : సమైక్య పాలనలో పోడు భూముల హక్కు పత్రాలు కొందరికే ఇచ్చి చేతులు దులుపుకున్నరు. మాకు పట్టాలు ఇవ్వకపోవడంతో యేటా సాగు చేసిన భూమి దగ్గరికి ఆటవీ శాఖ అధికారులు వచ్చి పంటలను నాశనం చేసేవారు. పంటలు పండించేందుకు పట్టా లేక బ్యాంకులో రుణాలు ఇచ్చేవారు కాదు. దీంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఉండేది.
నమస్తే : సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది?
ఆత్రం కట్టి : అడవిని నమ్ముకొని ఉన్న అన్నదాతలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. ఆదివాసీల్లో ఎంతో మందికి మంచి జరుగుతుంది. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న పట్టాల కోరిక నేటితో తీరిపోయింది. ఇక మేము సాగు చేస్తున్న భూములకు పూర్తి హక్కు లభించింది. ఇక పెట్టుబడి సాయం కూడా వస్తది.
నమస్తే : ఎన్ని ఏండ్ల నుంచి సాగు చేస్తున్నారు? ఎన్ని పంటలు పండించారు?
ఆత్రం కట్టి : తాతల నుంచి ఈ భూములు సాగు చేస్తున్నం. నాన్న తర్వాత ఈ భూమిపై నాకు హక్కు వచ్చింది. ఏడాదికి ఒకే పంట పండించే వాణ్ని. మాకు ఎలాంటి నీటి సౌకర్యం లేదు. వర్షకాల పంటలే పండిస్తున్న.
నమస్తే : సీఎం సారు చేతుల మీదుగా పట్టా అందుకోవడం ఎలా అనిపించింది?
ఆత్రం కట్టి : సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పట్టా అందుకోవడం చాలా గర్వంగా ఉంది. ఈ విషయం ఎప్పటికీ మర్చిపోలేను. పట్టా వస్తదని తెలుసు. కానీ, ఏకంగా సీఎం సారుతో తీసుకుంటానని కలలో కూడా అనుకోలేదు.
సీఎం టూర్ సైడ్ లైట్స్ ఇవే..
కుమ్రం భీం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ దాదాపుగా ఇక్కడే 3 గంటల పాటు ఉన్నారు. మధ్యాహ్నం 1.42 గంటలకు హెలిక్యాప్టర్లో జిల్లాకు చేరుకున్న ముఖ్యమంత్రి తిరిగి సాయంత్రం 4. 50 గంటలకు ప్రత్యేక బస్సులో హైదరాబాద్ బయలుదేరారు.