కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ కారిడార్ అడవులు పులులకు అడ్డాగా మారాయి. మహారాష్ట్రలోని తడోబా టైగర్ జోన్ నుంచి వలస వస్తున్న పులులు కాగజ్గర్ డివిజన్లోని అడవుల్లో ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి. చలికాలంలో పులుల సంతానోత్పత్తి సమయం కావడంతో ఆడ పులుల కోసం మగ పులులు వెతుక్కుంటూ వస్తాయి. కాగజ్నగర్, సిర్పూర్, కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూర్, దహెగాం, పెంచికలపేట్ మండలాలున్నాయి. అనుకోడ గుట్ట, తోళ్ల మడుగు, ఎర్రగుంట, జబ్బరి లొద్ది, దొడ్డుబాయి, సిద్ధేశ్వరగుట్ట, పులిపాగ, చిలుకల భీమన్న లొద్ది, దొంగ చెలిమా, తదితర ప్రాంతాలు పులులు, చిరుతలకు అనుకూలమైన ఆవాసా ప్రాంతాలుగా ఉండగా, ఇక్కడికి వాటి రాక పెరుగుతుందని చెప్పవచ్చు. పులుల జీవిత కాలం 15 ఏళ్లు మాత్రమే. పులి ఒక ఈతలో ఏడెనిమిది పిల్లలకు జన్మనిస్తుంది. మగ పులి రెండున్నరేళ్లు, ఆడ పులి మూడేళ్లు ఎదిగాక సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఈ క్రమంలోనే పులులు ఎగువ నుంచి దిగువ ప్రాంతమైన కాగజ్నగర్కు వలస వస్తున్నాయని, దీంతో రోజురోజుకూ పులుల సంఖ్య పెరుగుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
– కాగజ్నగర్, ఫిబ్రవరి 25
కాగజ్నగర్ కారిడార్లో..
కాగజ్నగర్ కారిడార్ వన్యప్రాణులు, పక్షులకు నిలయంగా మారుతుంది. ఇప్పటికే కాగజ్నగర్ డివిజన్ అడవుల్లో అనేక రకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. పులులు దాదాపుగా 10 నుంచి 12, చిరుత పులులు 15 నుంచి 20 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే నీల్గాయి, సాంబార్, కృష్ణజింకలు, చుక్కల దుప్పి, అడవి దున్నలు, కొండ గొర్రెలు, అడవి కుక్కలు, తోడేళ్లు, నక్కలు అనేకం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవల కాగజ్నగర్ మండలం అంకుసాపూర్ అటవీ ప్రాంతంలో 22 జింకలను వదిలారు. నెహ్రూ జూలోజికల్ పార్కు నుంచి వీటిని తీసుకొచ్చి ఇక్కడ వదిలినట్లు అధికారులు చెబుతున్నారు. సుమారు 300 రకాల పక్షులు ఉండగా, ఇందులో 20 రకాల వలస పక్షులు ఉన్నాయి.
2016లో అడుగుపెట్టిన ఫాల్గుణ..
మొదట 2013లో తడోబా నుంచి సిర్పూర్(టీ) మండలంలోని అడవుల్లోకి పులి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. మహారాష్ట్రలోని తడోబా టైగర్ జోన్ నుంచి తెలంగాణలోని కాగజ్నగర్ కారిడార్లోకి 2016లో ఫాల్గుణ పెద్ద పులి అడుగుపెట్టింది. ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకుంది. రెండు విడుతల్లో ఫాల్గుణ పెద్ద పులి 8 పిల్లలకు జన్మనిచ్చిందని అప్పట్లో ఫారెస్ట్ అధికారులు స్పష్టం చేశారు. దేశంలోనే రెండో అతి పెద్ద పులి కావడంతో ఫారెస్ట్ అధికారులు దాని పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 2018లో సెంట్రల్ స్పానర్స్ స్కీం ప్రాజెక్టు టైగర్ బృందం కాగజ్నగర్ డివిజన్లోని అటవీ ప్రాంతాన్ని పరిశీలించింది. పులి ఆవాసాలు, సంతానోత్పత్తికి అనుకూలంగా ఉందని ఆ బృందం స్పష్టం చేసింది. ఫాల్గుణ పెద్దపులి కాగజ్నగర్ డివిజన్లో అడుగుపెట్టిన అనంతరం కాగజ్నగర్ కారిడార్గా గుర్తించారు. దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించడంతో జూలై 2018లో ఫాల్గుణ పెద్దపులి చిత్రంతో పోస్టల్ స్టాంపు కూడా రూపొందించారు.
అడవుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడవుల అభివృద్ధి, పులులు, వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇందుకోసం యేటా రూ. 5 కోట్లు వెచ్చిస్తున్నది. డివిజన్ పరిధిలో 95 వేల హెక్టార్ల విస్తీర్ణంలో అటవీప్రాంతం ఉంది. అడవుల్లో జంతువుల కోసం నీటి వసతి కోసం చెక్డ్యాంలు, సాసర్పిట్లు, సోలార్ బోర్వెల్స్, సహజ నీటి కుంటలు, 1000 హెక్టార్లలో గడ్డి మైదానాలు, వాచ్ టవర్స్, తదితర వాటని ఏర్పాటు చేసింది. అంతేగాకుండా అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరుగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. మరోవైపు హరితహారంలో భాగంగా పలుచబడ్డ అటవీప్రాంతాల్లో మొక్కల పెంపకం చేపడుతుండగా, సత్ఫలితాలు వస్తున్నాయి.
అడవులు అనుకూలంగా ఉన్నాయి
కాగజ్నగర్ డివిజన్ లోని దట్టమైన అడవులు పులుల ఆవాసానికి అను కూలంగా ఉన్నాయి. మహారాష్ట్రలోని తడోబా టైగర్ జోన్ నుంచి ఇక్కడికి వచ్చి ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఎస్-9, ఎస్-10 పులులు కాగజ్నగర్ కారిడార్కు వచ్చాయి. పులులు, అడవుల సంరక్షణ కోసం అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం.
– వేణుగోపాల్, ఇన్చార్జి ఎఫ్ఆర్వో, కాగజ్నగర్