కోళ్లు, మేకలు, గొర్రెలు, కుందేళ్లు, చేపల పెంపకంతో లాభాల బాట
పండ్ల మొక్కలతో అదనపు ఆదాయం
సేంద్రియ పద్ధతిలో కూరగాయలు
ఉన్న ఊళ్లోనే స్వయం ఉపాధి
ఆదర్శంగా నిలుస్తున్న యువ రైతు
కోటపల్లి, నవంబర్ 21 : ఆ యువకుడు సాఫ్ట్వేర్ కంపెనీని వదిలి, తనకిష్టమైన సాగును ఎంచుకొని విజయవంతమయ్యాడు. ఏడెకరాల్లో వరికి బదులు వివిధ పంటలు వేస్తూ సిరులు పండిస్తున్నాడు. కూరగాయలు, పండ్ల తోటలతో పాటు నాటు కోళ్లు, కుందేళ్లు, మేకలు, గొర్రెలు, చేపల పెంపకం చేపడుతూ అత్యధిక లాభాలు సాధిస్తున్నాడు. ప్రతి నెలా లక్షల్లో ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బోరంపల్లి గ్రామానికి చెందిన యువరైతు రఘు సక్సెస్ స్టోరీ మీ కోసం..
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బోరంపల్లి గ్రామానికి చెందిన త్రిపురనేణి రఘుకు వ్యవసాయం అంటే ఇష్టం. తన తండ్రి సుబ్రహ్మణ్యం వెంట ఉంటూ వ్యవసాయం చేసుకుంటూనే విద్యాభ్యాసం కొనసాగించాడు. హైదరాబాద్లో ఎంసీఏ పూర్తి చేసి అక్కడే సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేసి కొన్నాళ్ల పాటు నిర్వహించాడు. ఆ తర్వాత తన తండ్రి బాటలో నడిచేందుకు సిద్ధమయ్యాడు. 7 ఏళ్ల క్రితం సాఫ్ట్వేర్ కంపెనీని వదిలి పెట్టిన రఘు తన గ్రామ సమీపంలోని జాతీయ రహదారి నం-63 పక్కన 7 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. 3 ఎకరాల్లో జామ, సీతాఫలం, మామాడి, ఉసిరి, నేరేడు, సపోట, నిమ్మ తోటలను సాగు చేయడం మొదలు పెట్టాడు. మరో ఎకరంలో సేంద్రియ పద్ధతిలో కూరగాయాలు సాగు చేస్తున్నాడు. ఇంకో ఎకరంలో చేపల పెంపకాన్ని చేపడుతున్నాడు. మిగతా భూమిలో షెడ్లు వేసి కుందేళ్లు, నాటు కోళ్లు, గొర్రెలు, మేకల పెంపకం చేపడుతున్నాడు.
నాటు కోళ్ల పెంపకంతో ఆదాయమెక్కువ..
గ్రామీణ ప్రాంతాల్లో లభించే నాటుకోళ్ల పెంపకంతో మంచి ఆదాయం పొందవచ్చని రఘు వివరిస్తున్నాడు. ప్రస్తుతం తన వద్ద 200 కోళ్లు వరకు ఉన్నాయని, కిలోకు రూ.400 చొప్పున విక్రయిస్తున్నట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో దొరికే కోళ్లను కిలోకు రూ. 250 చొప్పున కొని తీసుకొచ్చి ఇక్కడ పెంచుతున్నానని, ఉదయం, సాయంత్రం కోళ్లకు దాణా వేస్తున్నట్లు చెప్పాడు. కోళ్ల ద్వారానే సులభంగా నెలకు రూ.10 వేలకు వరకు ఆదాయం పొందవచ్చని చెబుతున్నాడు.
లాభసాటిగా కుందేళ్ల పెంపకం
ఆరు నెలల క్రితం రూ.50 వేల పెట్టుబడితో కుందేళ్ల పెంపకాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం తన ఫాంలో 30 కుందేళ్లు ఉన్నాయి. ఇవి ఎదిగిన తర్వాత అమ్ముకుంటే ఒక్కో కుందేలుకు రూ.800 నుంచి రూ. 1200 వరకు అమ్ముకోవచ్చు. కుందేలు సంవత్సరానికి ఐదుసార్లు పిల్లలు కంటుంది. ప్రతి ఈతకు 6 నుంచి 12 వరకు పిల్లలు పెడుతాయి. వీటిని సంరక్షిస్తే మన ఆదాయాన్ని సంవత్సరంలోపే రెట్టింపు చేసుకోవచ్చని వివరిస్తున్నాడు. ఇప్పటికే తన పెట్టుబడి తనకు వచ్చిందని, మున్ముందు మరింత ఆదాయం వస్తుందని చెబుతున్నాడు. కుందేళ్ల పెంపకం చేపట్టిన వారికి ఏడాది తర్వాత మంచి ఆదాయం వస్తుందని తెలిపాడు.
మేకలు, గొర్రెలతో అధిక లాభాలు
మేలు రకం మేకలు, గొర్రెల పెంపకం ద్వారా నెల నెలా మంచి ఆదాయం సాధించవచ్చని రఘు చెబుతున్నాడు. ఆరు నెలల క్రితం రూ. 4 లక్షల పెట్టుబడితో 50 గొర్రెలు, 50 మేకలు పెంపకం చేపట్టానని, ఈ వీటి ద్వారా సంవత్సరం తర్వాత రెట్టింపు ఆదాయం సమకూరుతుందని వివరిస్తున్నాడు. వీటి సంతతి ఏటేటా పెరుగుతూనే ఉంటుంది. తన ఫాంమ్లో మేక, గొర్రె, పొట్టేలు మంసం ధర కిలోకు రూ.370 నుంచి రూ.385 వరకు అమ్ముతున్నాడు. ప్రస్తుతం మేకలు, గొర్రెల పెంపకం ప్రారంభించి ఆరు నెలలు అవుతుందని, మరో ఆరు నెలల్లో తన పెట్టుబడి తనకు రానుందని రఘు వివరిస్తున్నాడు.
వినూత్నంగా ఉండాలని
వ్యవసాయంలో వస్తున్న మార్పులకనుగుణంగా పంటలు సాగు చేస్తున్న. మొదట్లో వరి వేసిన. అంతగా ఆదాయం రాలేదు. తర్వాత బాయిలర్ కోళ్ల పెంపకం చేపట్టిన. నష్టం వచ్చింది. ఒకే పంటపై ఆధారపడడం వల్ల నష్టపోయే ప్రమాదముంటుంది. అందుకే ప్రత్యామ్నాయం వైపు దృష్టి పెట్టిన. కోళ్లు, గొర్రెలు, మేకలు, చేపలు, కుందేళ్లకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తున్న. నా ఫాంలో సహజ పద్ధతిలోనే కోళ్లు, గొర్రెలు, మేకలు, చేపలు. కుందేళ్లను పెంచుతున్న. ఆదాయం మంచిగుంది. కోళ్లు, గొర్రెలు, మేకలు, చేపలు, కుందేళ్ల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులు నన్ను సంప్రదిస్తే సలహాలు, సూచనలు అందిస్తాను.
సేంద్రియ పద్ధతిలో కూరగాయల పెంపకం
రెండెకరాల్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు చేస్తున్నాడు రఘు. అల్చంత, వంకాయ, చిక్కుడు, బెండ, గోరు చిక్కుడు, టమాట, ఆకు కూరలను సాగు చేస్తున్నాడు. మూడు రోజులకోసారి సేకరించి స్థానిక మార్కెట్లో విక్రయిస్తున్నాడు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే కూరగాయల సాగు చేస్తున్నానని, వీటికి ఎలాంటి రసాయన ఎరువులను వాడడం, మందులను పిచికారీ చేయడం ఉండదని చెబుతున్నాడు. కూరగాయల ద్వారా ప్రతీ వారం రూ.4 వేల వరకు ఆదాయం వస్తుందని తెలిపాడు.