ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 192 షాపులకు టెండర్లు
తక్కువ దరఖాస్తుల కారణంతో 15 షాపుల డ్రా నిలిపివేత
ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కేటాయింపు
ఆద్యంతం ఉత్కంఠగా సాగిన కార్యక్రమం
ఎదులాపురం, నవంబర్20 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 177 మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ శనివారం పూర్తయింది. ఆయా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డ్రా ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. డ్రాలో దుకాణాలు పొందిన వారు ఆనందంతో, కోల్పోయిన వారు నిరాశతో వెనుదిరిగారు. తక్కువ దరఖాస్తులు వచ్చిన కారణంగా మరో 15 షాపుల కేటాయింపు ప్రక్రియ నిలిపివేస్తున్నట్లు అధికార యంత్రాంగం ప్రకటించింది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తనీషా గార్డెన్లో శనివారం నిర్వహించిన మద్యం దుకాణాల లక్కీ డ్రా ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం మధ్యా హ్నం 2 గంటల వరకు కొనసాగింది. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమక్షంలో జిల్లా వ్యాప్తంగా 40 మధ్యం షాపుల కేటాయింపునకు డ్రా నిర్వహించారు. మొత్తం 591 దరఖాస్తులు రాగా, ఇందులో ఆదిలాబాద్ పరిధిలో 354, ఇచ్చోడ 149, ఉట్నూర్ 88 దరఖాస్తులు వచ్చాయి. తొలిసారిగా రిజర్వేషన్ల వారీగా డ్రా ద్వారా ఎస్సీ, ఎస్టీ ,గౌడలకు దుకాణాలు కేటాయించారు. ఆదిలాబాద్ జిల్లాలోని 40 దుకాణాల్లో నాలుగింటి డ్రా ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. దరఖాస్తులు తక్కువ రావడంతో నిలిపివేయాలని నిర్ణయించారు. ఇందులో తలమడుగు దుకాణానికి 3, తాంసి దుకాణానికి 1, ఇచ్చోడ స్టేషన్ పరిధిలోని గుడిహత్నూర్ మన్నూర్(గౌడ్స్) 3 దరఖాస్తులు రాగా, తాత్కాలికంగా డ్రాను వాయిదా వేస్తునట్లు జిల్లా ఎక్సైజ్ సూపరిండెంటెండ్ రవీందర్రాజు ప్రకటించారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ అర్బన్, నవంబర్ 20: నిర్మల్ జిల్లాలోని కలెక్టర్ ముషారఫ్ అలీ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 47 మద్యం దుకాణాలకు 556 దరఖాస్తులు రాగా, 7 కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన దుకాణాలకు లక్కీడ్రాను అధికారులు నిలిపివేశారు. నిర్మల్ పట్టణంలోని విశ్వనాథ్పేట్ కాలనీలోని స్టార్ ఫంక్షన్ హాల్లో లక్కీడ్రా నిర్వహించారు. ఈసారి జిల్లాకు 10 దుకాణాలను అదనంగా కేటాయించారు. రిజర్వు స్థానాల్లో వారికే కేటాయించారు. కాగా, తక్కువ దరఖాస్తులు వచ్చిన ఏడు దుకాణాల డ్రాను అధికారులు నిలిపివేశారు. ఇందులో నిర్మల్ మున్సిపాలిటీ, లక్ష్మణచాంద, బాసర, లోకేశ్వరం, నర్సాపూర్(జీ)1, నర్సాపూర్(జీ)2, సిర్గాపూర్ ఉన్నాయి. కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్లు రవీందర్ రాజు, నాగేందర్, ఎక్సైజ్ సీఐలు సంపత్ కుమార్, సుందల్ ఉన్నారు.
మంచిర్యాల జిల్లాలో..
హాజీపూర్, నవంబర్ 20 : జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో ఉన్న పద్మనాయక గార్డెన్లో మద్యం దుకాణాల లక్కీ డ్రా శనివారం నిర్వహించారు. కలెక్టర్ భారతీ హోళికేరి ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిన నిర్వాహకులను ఎంపిక చేశారు. మంచిర్యాల జిల్లాలో 73 మద్యం దుకాణాలకు గాను 1170 దరఖాస్తులు రాగా, 71 షాపులకు లక్కీ డ్రా నిర్వహించారు. మిగిలిన 2 దుకాణాలకు తక్కువ దరఖాస్తుల రావడంతో నిలిపివేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. కాగా, ఈసారి ఆరుగురు మహిళలు లక్కీ డ్రాలో దుకాణాలను దక్కించుకున్నారు. డ్రాలో గెలుపొందిన వారు ఫీజు చెల్లించి లైసెన్స్ పొందాలని కలెక్టర్ సూచించారు.
కుమ్రం భీం జిల్లాలో..
ఆసిఫాబాద్, నవంబర్20: జిల్లా కేంద్రంలోని కుమ్రంభీం భవన్లో మద్యం దుకాణాల లక్కీ డ్రాను కలెక్టర్ రాహుల్రాజ్ అధ్యక్షతన నిర్వహించారు. 32 దుకాణాలకు టెండర్లు పిలువగా, లింగాపూర్, సిర్పూర్(యూ) దుకాణాలకు రెండేసి దరఖాస్తులు రావడంతో, డ్రాను నిలిపివేశారు. మిగతా 30 దుకాణాలకు లక్కీ డ్రా ద్వారా యజమానులను ప్రకటించారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. రెండు దుకాణాలకు డ్రా నిలిపివేయడంతో, కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. టెండర్లు వేసిన వారు ఆందోళనకు గురయ్యారు. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, జిల్లా అధికారి రాజ్యలక్ష్మి, ఎస్హెచ్వో మోసిన్ అలీ, సీఐ అశోక్, పోలీస్, ఎక్సైజ్ శాఖ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.