వ్యాధి వస్తే దాన్ని పరిశీలించి అప్పటికప్పుడు నయం చేసే వాడు నిపుణుడు. కానీ.. అదే వ్యాధికి మూలాన్ని వెతికి మళ్లీ రాకుండా చేసే వాడు నిజమైన వైద్యుడు. కరోనా మహమ్మారి కట్టడి విషయంలో అందరూ నిపుణుల్లా ఆలోచిస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం డాక్టర్లా ఆలోచించింది. ఎప్పటికప్పుడు కొవిడ్ను కట్టడి చేయడమే కాదు.. మున్ముందు రోజుల్లో అది విస్తరించకుండా ఉండేందుకు పక్కా ప్రణాళిక రూపొందించింది.
వారంతా ప్రతిరోజు ప్రజలతో మమేకమై ఉంటారు. నిత్యం ప్రజలకు అవసరమైన అన్ని రకాల అవసరాలు తీర్చేది వాళ్లే. ఉదయం లేచింది మొదలు.. తినే తిండి నుండి నడిచే బండి వరకు ఏ అవసరం తీరాలన్నా వారు చేసి పెట్టాల్సిందే. అలా వివిధ విభాగాల్లో పనిచేసే 3 లక్షల మంది నిత్య సేవలకుతోనే కరోనా నియంత్రణాస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ప్రజల నిత్యావసరాలను తీర్చే వారికి ముందస్తుగా కొవిడ్ వ్యాక్సిన్ వేయించడంవల్ల గ్రేటర్ మొత్తాన్ని రక్షణ ఛత్రం కిందకుతీసుకువచ్చేలా ఏర్పాట్లు చేపట్టింది.
ప్రభుత్వం గుర్తించిన వారందరికీ ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకాలు వేయనున్నట్లు హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్ శ్వేతామహంతి తెలిపారు. టీకాలు తీసుకునే వారు ఆధార్ కార్డులతో పాటు గుర్తింపు కార్డులను తీసుకు రావాలన్నారు. నిత్య సేవకులందరికీ కరోనా వ్యాక్సిన్ గ్రేటర్ జనాభా కోటిపైనే. వారందరి రోజువారీ అవసరాలైన రేషన్, కూరగాయలు, ఇంధనం, రవాణా, సమాచార వ్యవస్థ వంటి వాటిని అందజేస్తున్నది మాత్రం 3 లక్షల మంది. అలాంటి వారు ప్రజలతో ఎక్కువగా మమేకమై ఉంటారు. ఒకవేళ వీళ్లు వైరస్ బారిన పడితే.. ఇతరులకూ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ.
అందువల్లే ఈ 3 లక్షల మందికి యుద్ధ ప్రాతిపదికన కరోనా వ్యాక్సిన్ వేయించడం ద్వారా భవిష్యత్తులో కరోనాను కట్టడి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించిన ప్రభుత్వం… వారికి కూడా వాక్సిన్స్ వేసేందుకు ఏర్పాట్లు చేపట్టింది. ఇందుకోసం వైద్య ఆరోగ్య శాఖతో కలిసి జీహెచ్ఎంసీ 30 సర్కిళ్లలో 30 వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది. అదనపు కమిషనర్ల పర్యవేక్షణలో జోనల్ ఆఫీసర్లు కేటగిరీల వారీగా టోకెన్లు ఇచ్చి టీకాలు ఇవ్వనున్నారు. ఈనెల 28,29,30 తేదీల్లో గ్రేటర్లో ఉన్న ఈ విభాగాల వారందరికీ టీకా ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల వారీగా ఒకేచోట వ్యాక్సిన్ వేసేలా ఆర్టీఏ, వైద్య, ట్రాఫిక్ విభాగాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.