ఇంకా.. పెసర, మినుములు, శనగ వేసుకోవచ్చు..
ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం..
నమస్తే’తో చెన్నూర్ సహాయ వ్యవసాయ సంచాలకుడు బాపు
చెన్నూర్, డిసెంబర్ 19 : “యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు వేస్తే మంచిది. అధికంగా ఆరుతడి పంటలు వేయాలి. పప్పు దినుసులు, నూనె గింజలు అలికితే రాబడి అధికంగా ఉంటుంది. చెన్నూర్ డివిజన్ పరిధిలోని చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూర్, మందమర్రి మండలాల్లో పాల చౌక, నల్ల, ఎర్ర రేగడి నేలలు అధికంగా ఉంటాయి. వీటిలో యాసంగిలో ప్రధానంగా రైతులు వరి వేస్తారు. ఈ నెలల్లో ధాన్యం పండించడంతోపాటు పెసర, మినుములు, శనగ, మక్క, జొన్న, పొద్దు తిరుగుడు వేస్తే మంచిది. ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తూ ఆరుతడి పంటలపై అవగాహన కల్పిస్తున్నాం” అని చెన్నూర్ సహాయ వ్యవసాయ సంచాలకుడు జాడి బాపు తెలిపారు.
నమస్తే : యాసంగిలో వరికి బదులుగా ఏ పంటలు వేసుకుంటే మేలు?
ఏడీఏ : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటల వైపు రైతులను సమాయత్తం చేస్తున్నాం. నాతోపాటు మండల వ్యవసాయ అధికారులు, ఏఈవోలు చెన్నూర్ వ్యవసాయశాఖ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో రైతు సమావేశాలు నిర్వహించి.. ఆరుతడి పంటల ప్రయోజనంపై అవగాహన కల్పిస్తున్నాం. రైతులు కూడా సానుకూలంగా స్పందించి ఆరుతడి వైపు ముందుకు సాగుతున్నారు.
నమస్తే : రైతులను ఎలా సమాయత్తం చేస్తున్నారు.?
ఏడీఏ : ఈ ప్రాంత భూములు ఏయే పంటలకు అనుకూలంగా ఉన్నాయి. ఏ పంటలు సాగు చేస్తే అధిక దిగుబడి సాధించి, గిట్టుబాటు పొందవచ్చు. అనే విషయాలను రైతులకు వివరిస్తూ, వరికి బదులుగా ఇతర పంటలు వేసుకోవాలని సమాయత్తం చేసున్నాం.
నమస్తే : మన వద్ద ఏ రకం భూములు ఉన్నాయి? ఏ పంటలు వేయాలి?
ఏడీఏ : చెన్నూర్ వ్యవసాయశాఖ డివిజన్ పరిధిలో పాల చౌక, నల్ల, ఎర్ర రేగడి నేలలు ఉన్నాయి. వీటిలో రైతులు యాసంగిలో వరి సాగు చేస్తుంటారు. వరికి బదులుగా ఆరుతడి పంటలైన పెసరు, మినుములు, శనిగ, మక్క, జొన్న, పొద్దు తిరుగుడు సాగు చేసుకోవచ్చు. వీటికి పెట్టుబడి ఖర్చు కూడా తక్కువ. అలాగే అధిక దిగుబడి సాధించచ్చును. వరి కంటే అధిక గిట్టుబాటు లభిస్తుంది.
నమస్తే : ఆరుతడికి నీటి వనరులు ఎలా వినియోగించుకోవాలి?
ఏడీఏ : ఆరుతడి పంటలకు ప్రస్తుతం భూమిలో ఉన్న తేమ సరి పోతుంది. మన పొలాల వద్ద బోరు, బావి, విద్యుత్ మోటారు ఉంటాయి కాబట్టి విత్తనం విత్తినప్పుడు ఒక తడి, పూత దశతో ఒక తడి మొత్తం రెండు తడులు పెడితే చాలు. ఫలితంగా దిగుబడి అధికంగా వస్తుంది.
నమస్తే : ఆరుతడికి సర్కారు ఏమైనా ప్రోత్సాహకం అందిస్తుందా?
ఏడీఏ : పెసర, మినుము విత్తనాలను ఆహార భద్రత పథకం కింద 50 శాతం సబ్సిడీపై అందించాం. అలాగే కొందరు రైతులు వేరు శనగ సాగుకు ముందుకు రావడంతో వారికి సబ్సిడీపై విత్తనాలు అందించాం. ఇప్పటికే బావురావుపేట, జైపూర్ మండలాల్లోని శివ్వారం, పౌనూర్ గ్రామాల్లో పల్లి సాగవుతున్నది. పంట ఆశాజనకంగా ఉంది.
నమస్తే : చీడపీడల బెడద ఏమైనా సోకుతాయా?
ఏడీఏ : వాతావరణ పరిస్థితులను బట్టి చీడపీడలు సోకుతాయి. మా శాఖ అధికారులు, సిబ్బంది రోజూ గ్రామాల్లో పర్యటించి వ్యవసాయ క్షేత్రాలను సందర్శిస్తున్నారు. సస్య రక్షణ చర్యల గురించి రైతులకు తగిన సూచనలు, సలహాలను ఇస్తున్నాం.
నమస్తే : మార్కెటింగ్ ఏలా ఉంటుంది?
ఏడీఏ : ఆరుతడి పంటలను అమ్ముకునేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మన దేశం నూనె గింజలు, పప్పు దినుసుల కొరతను ఎదుర్కొంటున్నది. మన అవసరాలకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుతం ఈ పంటలకు మన దేశంలో మంచి డిమాండ్ ఉంది. కాబట్టి రైతులకు మార్కెటింగ్కు ఎలాంటి ఇబ్బంది ఉండదు.