ఆదిలాబాద్లో టాస్క్ఫోర్స్, ఫుడ్సేఫ్టీ అధికారుల తనిఖీలు
26 క్వింటాళ్లు స్వాధీనం
పరీక్షల కోసం ల్యాబ్కు తరలింపు
ఎదులాపురం, జూలై 16 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు గోదాముల్లో అనుమతి లేని ఆశీర్వాద్ గోధుమ పిండి నిల్వలను టాస్క్ఫోర్స్ సీఐ ఈ చంద్రమౌళి పట్టుకున్నారు. మొత్తంగా 26 క్వింటాళ్ల ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లా కేంద్రంలోని పలు గోదాముల్లో శుక్రవారం టాస్క్ఫోర్స్ సీఐ ఈ చంద్రమౌళి ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ పోలీసులు, ఫుడ్సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేశారు. ఇందులో రాష్ట్రంలో అనుమతి లేని ఆశీర్వాద్ గోధమ పిండికి సంబంధించిన భారీ నిల్వలు లభ్యమయ్యాయి. ముందుగా బీ రాములు కాంప్లెక్స్ వద్ద ఉన్న జేజే పటేల్ ట్రేడర్స్కు చెందిన గోదాములో 18 క్వింటాళ్లు, రూపేశ్ అగర్వాల్కు చెందిన గోదాములో 4 క్వింటాళ్లు, రాజేశ్ వట్టం వార్కు చెందిన గోదాములో 3.70 క్వింటాళ్ల గోధుమ పిండి ప్యాకెట్లను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారి టీ నాయక్ మాట్లాడుతూ.. ఈ ఆశీర్వాద్ గోధుమ పిండి ఐదు రాష్ర్టాల్లో అమ్మేందుకు వీలు లేదని, ప్యాకెట్ వెనుక భాగంలో రాసి ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ర్టాల్లో అమ్మరాదని తెలిపారు. అనుమతి లేకుండా జిల్లాలో విక్రయిస్తున్నందున వీటిని గుర్తించామన్నారు. నాణ్యతా ప్రమాణాల కోసం ల్యాబ్కు పంపిస్తామని చెప్పారు. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇలాంటి అనుమతి లేని గోధుమ పిండితో ప్రజలకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. అందుకే తెలంగాణలో వీటి విక్రయాలు నిషేధించారని తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుళ్లు దారట్ల శోభన్ కుమార్, ఎం రమేశ్కుమార్, కానిస్టేబుళ్లు ఠాకూర్ జగన్సింగ్, సయ్యద్ రాహత్, ఎంఏ కరీం, కాతిలే హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.