ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 199 పోస్టుల భర్తీ
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
కష్టకాలంలో పేదలకు అన్ని రకాల వైద్యం
ఆదిలాబాద్, జూన్ 16 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) :పేదలకు ఉచిత వైద్యసేవలు అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని సర్కారు దవాఖానల్లో వివిధ పోస్టుల భర్తీకీ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లతోపాటు రెండు జిల్లాల్లో 199 పోస్టుల్లో అర్హులైన వారిని నియమించనున్నారు. నిర్మల్ జిల్లాలో 148, ఆదిలాబాద్ జిల్లాలో 51 పోస్టులకు అనుమతి ఇచ్చింది. 15 నెలలుగా కరోనా పాజిటివ్ వచ్చినా వైద్యశాఖ అధికారులు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. రెండు జిల్లాల్లోని దవాఖానల్లో కొత్తగా భర్తీ చేయనున్న ఉద్యోగాలతో పేదలకు అన్ని రకాల వైద్యసేవలు అందనున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో సర్కారు దవాఖానకు పోవాలంటే రోగులు భయపడేవారు. సరైన వైద్యసేవలు అందకపోయేవి. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దవాఖానల్లో వైద్యులు, నర్సులు, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లతో పాటు ఇతర ఉద్యోగాలను భర్తీ చేసింది. అదేవిధంగా అవసరమైన మందులను సైతం అందుబాటులో ఉంచింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు స్థానికంగా ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్న ది. దీంతో సర్కారు దవాఖానలకు వచ్చే వారి సంఖ్య భారీ గా పెరిగింది. ఆదిలాబాద్ జిల్లాల్లోని మారుమూల పీహెచ్సీల్లో సైతం ప్రతి నెల 30 ప్రసవాలు జరుగుతున్నాయి. కరోనా కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం పకడ్బందీ గా చర్యలు చేపట్టింది. జిల్లా దవాఖానల్లో ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆక్సిజన్ బెడ్లను సమకూర్చారు. పీహెచ్సీల్లో కరోనా నిర్ధారణ పరీక్షలతో పాటు పాజిటివ్ వారికి వైద్యం అందిస్తున్నది. దీంతో ప్రైవేట్ దవాఖానలకు పోయే వారి సంఖ్య తగ్గింది.
రెండు జిల్లాల్లో 199 పోస్టుల భర్తీ
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 199 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో నిర్మల్ జిల్లాలో 148 పోస్టులు, ఆదిలాబాద్ జిల్లాలో 51 ఉద్యోగాలకు ఉన్నాయి. నిర్మల్ జిల్లా దవాఖానలో 21 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ఏఎన్ఎం, ఎంపీహెచ్ఏ (మహిళ) 8, డార్క్ రూం అసిస్టెంట్లు 4, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ 1, దోబీ 3, డ్రైవర్ 3, ఎలక్ట్రిషన్ 4, జూనియర్ అసిస్టెంట్ 2, ల్యాబ్ అటెండెంట్ 2, ల్యాబ్ టెక్నీషియన్ 4, ఎంఎన్వో 5, రిసిప్షనిస్ట్ 1, ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ 6, రేడియోగ్రాఫర్ 4, రికార్డ్ అసిస్టెంట్ 2, స్టాఫ్ నర్స్ 38, స్వీపర్ 2, థియేటర్ అసిస్టెంట్ 1, టైపిస్ట్ 3, డాటా ఎంట్రీ ఆపరేటర్ 1, ఈసీజీ టెక్నీషియన్ 1, సీటీ స్కాన్ టెక్నీషియన్ 1, సీ ఆర్మ్ టెక్నీషియన్ 2, సెక్యూరిటీ గార్డులు 4 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటితో పాటు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో 25 పోస్టుల కూడా ఉన్నాయి.
ఉట్నూర్ దవాఖానలో..
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ సర్కారు దవాఖానలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ 4 పోస్టులు, ఎంపీహెచ్ఏ (మహిళ) 1, ఎక్స్రే అటెండెంట్ 1, డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ 1, దోబీ 1, ఎలక్ట్రిషన్ 1, ఎంఎన్వో 2, ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ 1 వీటితో పాటు స్టాఫ్ నర్స్ 1, స్వీపర్ 1, సెక్యూరిటీ గార్డులు 2, బ్లడ్ బ్యాంక్లో సివిస్ అసిస్టెంట్ సర్జన్ పోస్టు 1, స్టాఫ్ నర్స్ 2, ల్యాబ్ టెక్నీషియన్ 2, డాటా ఎంట్రీ ఆపరేటర్ 1, ఆఫీస్ సబార్డినేట్ 1, డ్రైవర్ 1 పోస్టు మంజూరయ్యాయి. దీంతో పాటు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో 25 పోస్టులు కూడా ఉన్నాయి. ఉద్యోగాల భర్తీతో గిరిజన ప్రాంతాల ప్రజలు మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.