కేంద్ర వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకుడు సురేశ్ కుమార్
ఫార్మర్స్ ప్రొడ్యూసర్ సంస్థల ఏర్పాటుపై కలెక్టర్తో సమీక్ష
ఎదులాపురం, జూలై 14 : ఫార్మర్స్ ప్రొడ్యూసర్ సంస్థలు బ్యాంకుల ఆర్థిక సహకారంతో అభివృద్ధి చెందాలని కేంద్ర వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకుడు ఎస్ సురేశ్ కుమార్ అన్నారు. ఫార్మర్స్ ప్రొడ్యూసర్ సంస్థల ఏర్పాటుపై బుధవారం ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. బ్యాంకులు, నాబార్డ్ ఆర్థిక సహకారంతో సంస్థలు చేపడుతున్న వ్యాపారాలపై కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సిరికొండ, నార్నూర్, ఆదిలాబాద్ రూరల్, ఇచ్చోడ మండలాల్లో కొత్తగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ సంస్థలను ఏర్పాటు చేసి, సోయాబీన్ పంటను సేకరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ మండలాల్లో నాబార్డ్, ఏపీ మహిళా అభ్యుదయ సొసైటీల ద్వారా కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు పలు దశల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ వీడియోకాన్ఫరెన్స్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రమేశ్, ఎల్డీఎం చంద్రశేఖర్, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, బ్యాంకు మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.