నిర్మల్, డిసెంబర్ 12(నమస్తే తెలంగాణ) ;మార్కెట్లో నిరంతరం కూరగాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. ప్రతి కుటుంబానికి యేడాదిలో 365 రోజులు కూడా వెజిటేబుల్స్ అవసరం. ఇందుకు అనుగుణంగా కొందరు రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేస్తూ.. అధిక లాభాలు గడిస్తున్నారు. యేటా కార్తీక మాసం, అయ్యప్ప స్వాముల దీక్షలను దృష్టిలో పెట్టుకొని ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో అధికంగా వేస్తారు. ఇందుకు ఆదర్శంగా నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని సిద్ధులకుంట గ్రామ రైతులు నిలుస్తారు. వీరు సంప్రదాయ పంటలైన పసుపు, వరి, మొక్కజొన్న, సోయా, పత్తితోపాటు టమాట, కొత్తిమీర, బీర, వంకాయ, మిరప వంటి కూరగాయలు సాగు చేస్తున్నారు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఒక్కో రైతు ఒక్కో సీజన్లో విభిన్న కూరగాయలు సాగు చేస్తూ ఖర్చులు పోనూ రూ.2 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడు.
నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని సిద్ధులకుంట గ్రామానికి చెందిన పలువురు రైతులు సాధారణంగా పసుపు, వరి, మక్క, సోయా, పత్తి సాగు చేస్తారు. వీటితోపాటు టమాట, కొత్తిమీర, బీర, వంకాయ, మిరప వంటి కూరగాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన గల ముంపు గ్రామమైన సిద్ధులకుంటలో చెరువులు, కుంటలు, ఇతర సాగునీటి వనరులు పెద్దగా లేనప్పటికీ, గత తెలంగాణ సర్కారు నుంచి అందజేస్తున్న నిరంతర కరెంటుతో బోరు బావుల నీటిని ఒడిసిపట్టి సిరులు పండిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో టమాట కిలో రూ.30 పలుకుతోండగా.. కొత్తిమీర 250 గ్రాములకు రూ.40, వంకాయలు కిలో రూ.80, బీరకాయలు కిలో రూ.100ల చొప్పున లభిస్తున్నాయి. ఇలా ధరలు మండిపోతున్న క్రమంలో సిద్ధులకుంట రైతులు మాత్రం కూరగాయలు పండిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
రూ.2 లక్షలు వస్తాయి..
నాకు 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. యేటా వానకాలంలో ఏడెకరాల్లో పసుపు, ఒక ఎకరంలో వరి, మిగతా భూమిలో మొక్కజొన్న, ఎర్ర జొన్న, ముళ్ల జొన్న వేస్తా. చలికాలంలో కూరగాయల దిగుబడులు అధికంగా ఉంటాయి. కార్తీకమాసం, అయ్యప్ప స్వాములు దీక్షలు ఉండడం వల్ల మంచి డిమాండ్ ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని యేటా ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో టమాట, మిరప, వంకాయ వేస్తాం. ఈ యేడు ఎకరంలో టమాట వేశా. గత నెల 10న మొదటి దిగుబడి వచ్చింది. రెండు, మూడు రోజులకోసారి 50 క్యారెట్ల దిగుబడి వస్తున్నది. ప్రస్తుతం టమాటకు నిర్మల్ మార్కెట్లో మంచి ధర ఉన్నది. 25 కిలోల క్యారెట్ ధర నాణ్యతను బట్టి రూ.300-రూ.450 పలుకుతున్నది. ఇప్పటివరకు రూ.లక్షకు పైగా వచ్చింది. మరో నెల రోజుల వరకు దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఎకరం టమాట సాగు కోసం విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, దుక్కి, కూలీలకు కలిపి రూ.20వేల వరకు ఖర్చులు అయ్యాయి. ఎప్పుడూ ఒకే రకమైన పంటలు కాకుండా మార్కెట్లో డిమాండ్ ఉన్నవి వేస్తే కచ్చితంగా లాభాలు వస్తాయి. ఒక్క టమాట సాగుతోనే ఈ సీజన్లో రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
– నర్సారెడ్డి, టమాట రైతు, సిద్ధులకుంట
తోట వద్దకే వచ్చి కొంటున్నారు..
నాకు ఆరెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. వానకాలంలో పసుపు, మొక్కజొన్న, సోయా వేస్తా. పసుపు పంట చేతికి రావాలంటే 9 నెలలు పడుతుంది. ఆ తర్వాత 3 నెలలపాటు కూరగాయలు పండిస్తా. ఈ యేడు ఎకరం భూమిలో వంకాయ, బీరకాయ పంటలు వేశా. మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వంకాయలు ప్రస్తుతం ఒక్కో క్యారెట్ (12 కిలోలు) రూ.500 ధర ఉన్నది. రోజుకు 12 క్యారెట్ల వంకాయలు తెంపుతున్నా. రూ.6 వేల వరకు ఆదాయం వస్తున్నది. వ్యాపారులు తమ తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రవాణా ఖర్చులు కూడా మిగులుతున్నాయి. బీర ఇంకా పూత దశలో ఉంది. రోజు ఆహారంగా తీసుకునే కూరగాయలకు అన్ని కాలాల్లోనూ డిమాండ్ ఉంది. రైతులు సంప్రదాయ పంటలతోపాటు ఉన్న దాంట్లో కొంత భూమిని కూరగాయలు, ఆకుకూరల సాగుకు కేటాయించాలి. ఒక పంటలో నష్టం వచ్చినా… మరో పంటలో లాభం వచ్చే అవకాశం ఉంది. – నవీన్, రైతు, సిద్ధులకుంట, సోన్ మండలం.
నిరంతర కరెంటుతో కొత్తి మీర సాగు..
ప్రతి వంటకం చివరలో కొత్తిమీర వేయడం మన ఇళ్లల్లో ఒక అలవాటు. యేడాదిలో 365 రోజులు కొత్తిమీరకు డిమాండ్ ఉంటుంది. ప్రతి సీజన్లో సాధారణ పంటలతోపాటు కొత్తిమీర, ఇతర కూరగాయల సాగుకు రెండెకరాల వరకు భూమిని కేటాయిస్తా. కేవలం కొత్తిమీర కోసమే దాదాపు ఎకరం కేటాయించి మడులను సిద్ధం చేస్తాం. ఆయా మడుల్లో వారం, పది రోజుల తేడాతో కొత్తిమీర విత్తనాలు వేస్తాం. దీనివల్ల ఒకేసారి కోతకు రాకుండా దఫదఫాలుగా వస్తుంది. ఒక్కో మడి పంటను వారం అమ్ముకునే వెసులుబాటు ఉండడంతో ధరల్లో హెచ్చు తగ్గులైనప్పటికీ నష్టపోయే అవకాశం ఉండదు. నిర్మల్ మార్కెట్లో ప్రస్తుతం క్వింటాలుకు రూ.2500-రూ.3వేల ధర ఉన్నది. 45 రోజుల నుంచి రోజుకు క్వింటాలు చొప్పున కొత్తిమీర అమ్మిన. ఇప్పటి వరకు రూ.లక్షకు పైగా ఆదాయం వచ్చింది. మరో 20 రోజుల వరకు అమ్ముకునేందుకు సరిపడా పంట ఉంది. కేవలం బోరు బావులపైనే ఆధారపడి సాగు చేస్తున్నా. నిరంతర కరెంటుతో చలికాలంలోనే కాకుండా మండు వేసవిలోనూ కూరగాయలు పండించి లాభాలు పొందుతున్న. ఒకే రకమైన పంటలు వేసే బదులు.. డిమాండ్ ఉన్న పంటలు వేస్తే లాభాలు వస్తాయి.
– ఆలూరి శ్రీనివాస్రెడ్డి, రైతు, సిద్ధులకుంట, సోన్ మండలం